ఆ సినిమా చూసేందుకు ఆ రాష్ట్ర పోలీసులకు ఒక రోజు సెలవు

Update: 2022-03-16 04:25 GMT
మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారిని కాసేపు పక్కన పెట్టేద్దాం. తెలుగు మాత్రమే మాట్లాడే వారు హిందీ.. ఇంగ్లిషు సినిమాలు చూడటం చాలా తక్కువ. ఒకవేళ చూసినా..వాళ్లంతా యూత్ కు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. అలాంటిది భాష రాకున్నా.. సినిమా చూడాలన్న ఉద్దేశంతో థియేటర్ కు వెళ్లే రోజులు ఇప్పుడైతే లేవనే చెబుతారు. అలాంటి మాటల్ని పక్కన పెట్టేసి.. సినిమా చూసే అలవాటు మానుకున్న వారిని సైతం థియేటర్లకు వెళ్లేలా చేస్తోంది ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ. దేశ వ్యాప్తంగా సంచలన చర్చకు తెర తీయటమే కాదు.. అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు రాజకీయ.. సామాజిక వేదికల మీద పెద్ద చర్చకు తెర తీసింది.

1990లొ కశ్మీరీ పండిట్ల ఊచకోత ఎంత దారుణంగా సాగిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటం.. ఈ సినిమాను చూసిన వారంతా.. తాము చిన్నతనంలో (ఇప్పుడు ముప్ఫై ఏళ్లు ఉన్న వారు) ఉన్నప్పుడు దేశంలోని ఒక ప్రాంతంలో ఇంత దారుణం జరిగిందా? అన్న షాక్ కు గురవుతున్నారు.

ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ మూవీ రిలీజ్ అతి తక్కువ థియేటర్లలో స్క్రీనింగ్ తో మొదలై.. ఇప్పుడు అందుకుమూడు రెట్లు ఎక్కువ స్క్రీన్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారంటే.. సినిమాకు లభిస్తున్న ఆదరణ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇక.. గుజరాత్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మూవీకి పన్ను రాయితీ ఇచ్చారు. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. వాస్తవాల్ని వక్రీకరించారని కశ్మీర్ లోని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. జరిగిన దారుణానికి సంబంధించి ఇప్పటికైనా వాస్తవాలు కొన్ని అయినా బయటకు వచ్చాయని కశ్మీరీ పండిట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను రాయితీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు తమ కుటుంబాలతో సహా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను చూసేందుకు రాష్ట్ర పోలీసులందరికి ఒక రోజు సెలవును ప్రకటించటం గమనార్హం.

మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఒక రోజో లీవ్ తీసుకొని సినిమాకు వెళ్లవచ్చని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా నేరుగా రాష్ట్ర డీజీపీనే ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సినిమా విడులయ్యే సమయంలో ఈ మూవీ మీద పెద్ద అంచనాలు లేనప్పటికీ.. సినిమా విడుదలయ్యాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సినిమా దర్శక నిర్మాతల్ని పిలిపించి మరీ ప్రత్యేకంగా అభినందించటం.. సోషల్ మీడియాలో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News