ఉక్రెయిన్ లో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.. మంచు మంచినీరాయే..!

Update: 2022-03-06 01:30 GMT
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు నలిగిపోతున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. స్వదేశానికి ఎప్పుడెప్పుడు వస్తామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏ బాంబ్ వచ్చి మీద పడుతుందోనని హడలిపోతున్నారు. అంతేకాకుండా తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకర్లలో భయం గుప్పిట్లో తలదాచుకుంటున్నామని... కనీసం కూర్చునేందుకు కూడా ప్లేస్ లేదని అంటున్నారు. భారత ఎంబసీ వేగంగా స్పందించి... ఇండియాకు చేరవేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భారత విద్యార్థులను తరలించడంపై రష్యా కాస్తా సానుకూలంగానే ఉంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని సుమీ స్టేట్ విశ్వవిద్యాలయంలో చాలామంది భారతీయులు చదువుతున్నారు. తూర్పు వైపు యుద్ధం ప్రభావం ఎక్కువగా ఉంది. గురువారం నుంచి రష్యా సైన్యం ఇంకా ముందుకు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.

తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై భారత ఎంబసీకి చెప్పినా... స్పందన లేదని వాపోతున్నారు. రష్యా సరిహద్దుకు 48 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండడం వల్ల యుద్ధం ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది.

ముందుగానే యుద్ధ సంకేతాలు రావడంతో కొందరు నీరు, ఆహారం తెచ్చుకున్నారు. అయినా అవి ఎంతకాలం వస్తాయి. వారానికి సరిపడ ఫుడ్ తెచ్చుకుంటే... అది కూడా అయిపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాంబు పేలుళ్లలో మంచినీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వాటర్ కు తీవ్ర కొరత ఏర్పడింది. అసలే ఎండాకాలం.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాహం తట్టుకోలేకపోతున్న ఈ తరుణంలో మంచు వరంలా కురిసింది. కొందరు విద్యార్థులైతే ఏకంగా మంచునే కరిగించి... బాటిళ్లలో నింపుకుంటున్నారు. వాటితో పెదవులను తడుపుకుంటున్నారు.

సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు మాత్రమే ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రధాన రవాణా మార్గం రైలు. అయితే బాంబు పేలుళ్లలో రైలు పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే సేవలు స్తంభించాయి. మరోవైపు విమానయానం రద్దయింది. ఇక రోడ్డు మార్గాల్లో తరలించాలంటే రష్యన్ బలగాల చెక్ పోస్ట్. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సరిహద్దుకు రావడానికే అదే ప్రధాన సమస్యగా మారింది. ఖార్కివ్, సుమీలో కలిపి మొత్తం వెయ్యి మంది విద్యార్థులు ఉంటారని అంచనా.

కొందరు విద్యార్థులు కాలినడకన సరిహద్దులకు పయనమయ్యారు. కానీ భారత రాయబార కార్యాలయం వారిని వద్దని వారించింది. భయంతో ఎటువంటి ముప్పు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించింది. భారతీయులందరినీ సురక్షితంగా చేర్చుతామని ప్రకటించింది. జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలని సూచనలు చేసింది.
Tags:    

Similar News