సైకిల్ గుర్తు రాకుంటే వాళ్ల సింబ‌ల్ ఇచ్చేస్తార‌ట‌

Update: 2017-01-16 06:22 GMT
ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్‌కు అనూహ్య‌మైన తీపిక‌బురు ఇది. ఉత్తరప్రదేశ్‌ లో అధికార సమాజ్‌ వాది పార్టీలో విభేదాలు తలెత్తడం - కుమారుడు అఖిలేష్ యాదవ్ దూరం కావడంతో దాదాపుగా ఒంటరై పోయి పార్టీ గుర్తు సైకిల్‌ కోసం పోరాడుతున్న ములాయం సింగ్‌ కు అనుకోని ఆఫర్ లభించింది. ఎన్నికల కమిషన్ గనుక ఒకవేళ సైకిల్ గుర్తును అఖిలేష్‌ కు కేటాయించినా లేక ఇరు వర్గాల్లో ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేసినా తమ పార్టీ గుర్తును - జాతీయ అధ్యక్ష పదవిని అప్పగిస్తామని ములాయం సింగ్‌ కు లోక్‌ దళ్ ఆఫర్ చేసింది. లోక్‌ దళ్ జాతీయ అధ్యక్షుడు సునీల్ సింగ్  విలేఖరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. లోక్‌ దళ్ పార్టీ గుర్తును - జాతీయ అధ్యక్ష పదవిని ములాయం సింగ్‌ కు ఇస్తామని, ఆయనతో కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ సిద్ధమేనని సునీల్ సింగ్ చెప్పారు.  ములాయం సింగ్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయన చెప్పారు. సీబీఐ కేసునుంచి తన కుమారుడు, కుమార్తెను కాపాడుకోవడానికి రాంగోపాల్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని, ఆయన మాటలు నమ్మవద్దని, తండ్రి ములాయం మాట ప్రకారమే నడుచుకోవాలని ఆయన అఖిలేశ్‌ కు సూచించారు.

లోక్‌ దళ్ పార్టీకి ఎన్నిక‌ల క‌మిష‌న్‌ గుర్తింపు ఉంది. నాగలితో పొలం దున్నుతున్న రైతు ఈ పార్టీ గుర్తు. 1980లో సోషలిస్టు నాయకుడు చరణ్ సింగ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పట్లో ములాయం సింగ్ ఈ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ములాయం ఆ పార్టీకి దూరమై సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశారు. 2012 యుపి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌దళ్ 76 స్థానాలకు పోటీ చేసింది కానీ, ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. సైకిల్ గుర్తు కేటాయింపుపై తీర్పు రిజర్వు చేసిన ఎన్నికల కమిషన్ తన తీర్పును ప్రకటించిన తర్వాత తమ ముందున్న మార్గాలు, ఆ తీర్పు ప్రభావం ఎన్నికలపై ఉంటుందనే దానిపై ఎస్పీలోని ప్రత్యర్థి వర్గాల నేతలు  రోజంతా తమ సన్నిహితులతో మంతనాలు జరిపిన నేపథ్యంలో లోక్‌దళ్ ఈ ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం. పార్టీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు పెద్దఎత్తున తమ మద్దతుదారులతో లక్నోలోని అఖిలేశ్ - ములాయం నివాసాలకు చేరుకుంటుండడంతో ఇరు వర్గాల శిబిరాలు సందడిగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News