సీనియర్ సిటిజన్లకు కీలక సూచన చేసిన మోడీ సర్కార్

Update: 2021-09-06 03:00 GMT
మోడీని ఎంతలా అభిమానించినా తప్పేం కాదు. ఆయన విధానాల గురించి వీరత్వం గురించి అదే పనిగా పొగిడేవారైనా సరే.. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాల మీద మాత్రం ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తుంది.. సీనియర్ సిటిజన్ల విషయంలో ఆయన మొండిగా.. అంతకు మించిన కఠినంగా ఉండటం బాధిస్తుంది. ఎక్కడిదాకానో ఎందుకు? 60 ఏళ్లు దాటిన పెద్ద వయస్కులు ట్రైన్లో ప్రయాణించే సమయంలో వారికి రాయితీ ఇవ్వటం తెలిసిందే. దానికి సైతం పరిమితులు పెట్టిన పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మోడీ మాత్రమే.

అంతేనా.. కరోనా పేరుతో.. ట్రైన్లో ప్రయాణించే పెద్ద వయస్కుల వారికి ఇచ్చే కన్ సెషన్ కు కోత పెట్టటం ద్వారా వారందరికి షాకిచ్చారు. పెద్ద వయసులో ఆదాయం తగ్గి.. పిల్లల మీద ఆధారపడే వయసులో.. వారికి మరింత దన్ను ఉండేలా ప్రభుత్వం నుంచి ప్రోత్సహాలు ఉండాలి. అందుకు భిన్నంగా.. ఉన్న దాన్నే కోత పెడితే కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇలా చూసినప్పుడు పెద్ద వయస్కుల విషయంలో మోడీ సర్కరు ప్రత్యేకించి ఆలోచించిందంటూ ఏమీ కనిపించదు. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్.. తాజాగా ఒక సదుపాయాన్ని ప్రకటించింది.

కొంతమేర  దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పాలి. కాకుంటే.. 75 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇంతకూ విషయం ఏమంటే.. 75 ఏళ్లు దాటిన పెద్ద వయస్కులు ఐటీ రిటర్నులు దాఖలు చేయటానికి మినహాయింపులు పొందేందుకు అవసరమైన వాంగ్మూల పత్రాల్ని ఐటీ విభాగం నోటిఫై చేసింది. దీని ప్రకారం 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు.. పింఛను ఆదాయం.. ఫిక్సెడ్ డిపాజిట్ల మీద వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందుతుంటే.. వారంతా 2021 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

తాజా నిబంధనలతో సహా డిక్లరేషన్ ఫామ్ లను నోటిఫై చేశారు. వీటిని సంబంధిత బ్యాంకుల్లో సమర్పిస్తే.. టీడీఎస్ కోతను బ్యాంకులు నిలిపివేయనున్నట్లు పేర్కొంది. అయితే.. దీనికున్న ఒకే ఒక్క పరిమితి ఏమంటే.. పింఛను డిపాజిట్ అయ్యే బ్యాంకులోనే వడ్డీ ఆదాయం కూడా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పాలి. ఫర్లేదు.. పెద్ద వయస్కుల గురించి కూడా మోడీ సర్కారు ఆలోచిస్తోంది.
Tags:    

Similar News