కెనడాలో దుమారం రేపిన భారతీయ విద్యార్థి హత్య

Update: 2022-04-12 08:30 GMT
కెనాడోలోని టొరొంటోలో జరిగిన  కాల్పుల్లో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మృతి చెందడం కలకలం రేపింది. అతడి చివరి చూపు కోసం తల్లిదండ్రులు, బంధువులు ఇప్పుడు భారత్ లో ఎదురుచూస్తున్నారు.కెనడాలోని భారత హైకమీషన్ అధికారులు కార్తీక్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్పుల ఘటనలో కార్తీక్ వాసుదేవ్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తరలించేందుకు అతడి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్టు ఇండియన్ హైకమీషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

కార్తీక్ గురువారం తను పనిచేసే రెస్టారెంట్ కు వెళుతుండగా టొరొంటో నగరంలోని సబ్ వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న కార్తీక్ కు ఓ పారా మెడికిల్ ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతుండగానే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు టొరొంటో పోలీసులు వెల్లడించారు.

జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి, కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కానరానీ లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించి డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేయాలనే లక్ష్యంతో మూడు నెలల క్రితమే తమ బిడ్డ కెనడాకు వెళ్లాడని.. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్తీక్ తండ్రి జితేష్ వాసుదేవ్, తల్లి పూజా తమ బిడ్డ కెనడా వెళ్లాలని ఎంతగా శ్రమించింది వారు గుర్తు చేసుకున్నారు. 10వ తరగతిలో ఉన్నప్పుడే కెనడాకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకొని అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు కార్తీక్ ఈ ఏడాది జనవరి 4న కెనడాకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. టొరొంటోలోని సెనెకా కాలేజీలో చేరిన కార్తీక్. ప్రస్తుతం ఆన్ లైన్ లో తరగతులకు హాజరవుతున్నాడు.

కాగా కెనడాలోని టొరంటో నగరంలోని సబ్‌వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద రెండు రోజుల క్రితం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తుపాకీ కాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్‌ మృతిచెందారు. కార్తీక్ తన పనిపై వెళుతుండగా సెయింట్ జేమ్స్ టౌన్‌లోని షెర్బోర్న్ టిటిసి స్టేషన్‌కు గ్లెన్ రోడ్ ప్రవేశద్వారం వద్ద   కాల్పుల్లో మరణించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని టొరంటో పోలీస్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

టొరంటో పోలీస్ సర్వీస్‌కు చెందిన క్రైం స్క్వాడ్ విచారణ చేపట్టింది. ఈ ప్రాంతంలో కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సాక్షులు, డ్రైవర్లు లేదా వ్యాపార సంస్థలతో విచారించారు. "నిన్న టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మరణించినందుకు మేము దిగ్భ్రాంతి చెందాము" అని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో రాసింది. "కార్తీక్ కుటుంబంతో టచ్ లో ఉన్నామని.. మృత దేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంలో సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తాము" అని  ఇండియన్ కౌన్సిల్ లో తెలిపింది.
Tags:    

Similar News