న్యూఇయ‌ర్ సాక్షిగా తీవ్ర‌వాదులు ఇబ్బందిపెట్టారు

Update: 2017-01-01 16:35 GMT
నూత‌న సంవ‌త్స‌రం మొద‌టిరోజునే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామం ఎదురైంది. దేశమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉండగా - నేరగాళ్లు భద్రతా సంస్థల వెబ్‌ సైట్లను టార్గెట్‌ చేసుకున్నారు. దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్రవహిస్తోన్న నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ ఎస్‌ జీ) అధికారిక వెబ్‌ సైట్‌ ను హ్యాక్‌ చేశారు. అంతేకాకుండా అందులో అభ్యంత‌ర‌క‌ర‌మైన చిత్రాలు పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్‌ ఎస్‌ జీ సైట్‌ లో  సమాచారం స్థానంలో ఓ అభ్యంతరకర మెసేజ్‌ ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో హ్య‌కింగ్ కు గురైన‌ట్లు నిర్దార‌ణ అయింది.

హ్యాకింగ్‌ కు పాల్పడిన గ్రూప్‌ తనను తాను ‘అలోన్‌ ఇంజెక్టర్‌’గా పేర్కొంది. ఇలా తాము ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో కూడా హ్యాక‌ర్లు వివ‌రించారు. కశ్మీర్‌ లో ప్రభుత్వ - సైనిక హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర రాతలు రాశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెబ్‌ సైట్‌ ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఉగ్రదాడుల సమయంలో ప్రజలను కాపాడే బాధ్యతను తలకెత్తుకునే ఎన్‌ ఎస్‌ జీ కమాండోలు.. రాష్ట్రపతి - ప్రధాని - కేంద్ర మంత్రులు - రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ఇతర వీవీఐపీలకూ అనునిత్యం భద్రత కల్పిస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన సంస్థ వెబ్‌ సైట్‌ హ్యాకింగ్‌ కు గురికావడంతో హోంశాఖ వర్గాల్లో కలకలం రేగింది. ఈ పరిణామంపై ఎన్ ఎస్‌ జీ వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇస్తూ సైబ‌ర్ భ‌ద్ర‌త విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని తెలిపాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News