చెప్పు చూపించడంపై మరోసారి పవన్‌ హాట్‌ కామెంట్స్‌

Update: 2022-10-31 08:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇటీవల పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనతో ఒక్కసారిగా హీటెక్కిన సంగతి లె లిసిందే. అక్కడ పవన్‌ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం, తన ర్యాలీకి కరెంటు తీసివేయడం, పోలీసుల అతి, అర్థరాత్రిళ్లు పవన్‌ బస చేసిన హోటల్‌లో జనసేన నేతలను అరెస్టు చేయడం, తనను కలవడానికి వచ్చిన ప్రజలపై లాఠీచార్జ్‌ చేయడం వంటివి పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

ఈ నేపథ్యంలో ఆయన విశాఖ ఘటన జరిగిన మరుసటి రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బూతులు తిట్టే వైసీపీ నా కొడుకులను చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించారు. దీనిపై వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సైతం పవన్‌ పేరు ఎత్తకుండా పవన్‌పై అవనిగడ్డ సభలో మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాజాగా చెప్పు తీసి కొడతానంటూ తాను చేసిన వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు.

తాను తీవ్రమైన ఆవేదనకు గురయ్యే బూతులు తిట్టే వైసీపీ నేతలను చెప్పుతా కొడతానన్నానని పవన్‌ తెలిపారు. ‘‘నా ఇంట్లోని మహిళల్ని రేప్‌ చేసి చంపేస్తామనే వారికి పాలకులు గులాం కొడుతున్నారు.  వ్యవస్థల్ని నాశనం చేసే పాలకులకు పెద్ద స్థాయి అధికారులు సైతం వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పాలకులకు చెప్పు చూపించకుండా ఇంకేం చూపిస్తాం?’ అంటూ పవన్‌ ప్రశ్నించారు.

 వైసీపీ నేతలు ఏ భాషలో మాట్లాడితే.. ఆ భాషలోనే తాము కూడా సమాధానం ఇస్తామని పవన్‌ తేల్చిచెప్పడం విశేషం. చట్టాన్ని అపహాస్యం చేసేలా ఉగ్రవాదులు రాష్ట్రాన్ని పాలించటం మన దౌర్భాగ్యమని పరోక్షంగా జగన్‌పై నిప్పులు చెరిగారు. 2024లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మొదట సుగాలీ ప్రీతి కేసును తొలుత చేపడతామని వెల్లడించారు.

విశాఖ పర్యటన సందర్భంగా తనపై దాడికి ప్లాన్‌ చేశారన్న పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన పర్యటనకు ఐదు రోజుల ముందే తన శ్రేయోభిలాషుల ద్వారా తనకు సమాచారం వచ్చిందన్నారు. అయినా సరే తాను అన్నింటికి తెగించే విశాఖ వెళ్లానని తెలిపారు.

విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను విధ్వంసం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని పవన్‌ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖకు వెళ్లిన తర్వాత ప్రభుత్వ కుట్ర అర్థమైందని చెప్పారు. పోలీసులు బెదిరింపులకు గురి చేసినా.. సహనంతోనే ఉన్నానని తెలిపారు. అయినా ఐపీఎస్‌ స్థాయి అధికారి తన వాహనం ఎక్కి పదే పదే తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

తనపై కుట్ర జరిందన్న పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేత పేర్ని నాని.. పవన్‌ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News