మాజీల్లో ముగ్గురికి ప్రమోషన్.. పది మందికి డిమోషన్

Update: 2022-04-20 04:53 GMT
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పదమూడు మంది మంత్రులు తమ పదవుల్ని కోల్పోవటం తెలిసింది. తనకు అత్యంత సన్నిహితులన్న పేరున్న వారిపై కత్తి పట్టి.. పదవులను ఊడబెరికిన జగన్.. తాజాగా వారికి కాస్తంత ఊరట కలిగించేలా చేశారు. ఈ క్రమంలో మొత్తం 13 మందికి పదవులు పోతే.. ముగ్గురికి మాత్రం ప్రమోషన్ అన్న తరహాలో నిర్ణయం తీసుకొని.. మిగిలిన పది మందికి మాత్రం డిమోషన్ అన్నట్లుగా ఆయన నిర్ణయం ఉంది.

జగన్ సన్నిహితులు.. ఆయనకు ఏ సమయంలో అయినా వెనుకా ముందు చూసుకోకుండా మద్దతు ఇచ్చే నేతలుగా పేరున్న వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి.. కొడాలి నాని.. అనిల్ కుమార్ లుగా చెబుతుంటారు.

అలాంటి ఈ ముగ్గురు తాజాగా మాజీలు కావటం.. అధినేత నిర్ణయంపై అసంతృప్తితో ఉండటం తెలిసిందే. ఇలాంటివేళ.. ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పజెప్పటం ద్వారా.. వారికి తాను ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుందన్న భావన కలిగేలా చేశారు.

అదే సమయంలో మాజీలైన పది మంది మంత్రులకు మాత్రం జిల్లా అధ్యక్ష పదవుల్ని కేటాయించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం బాలినేని.. కొడాలి.. అనిల్ కు కాస్తంత ఊరట కలగటం ఖాయమన్న ను అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ ఎంపిక చేసిన ప్రాంతీయ సమన్వయ కర్తలకు సంబంధించిన విశేషం మరొకటి ఉంది. మొత్తం 11 మంది ప్రాంతీయ సమన్వయ కర్తల్లో ఆరుగురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం. పార్టీకి అండగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల విషయంలో పెద్దపీట వేయటం ఆసక్తికరంగా మారింది.

మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన జగన్.. ప్రాంతీయ సమన్వయ కర్తల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. ఇక.. మొత్తం పదకొండమంది ప్రాంతీయ సమన్వయకర్తల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీ వర్గాలకు చెందిన వారికి చోటు కల్పించకపోవటం దేనికి సంకేతం?
Tags:    

Similar News