రాహుల్ హైద‌రాబాద్ బిగినింగ్ అదిరింది క‌దా?!

Update: 2018-08-13 13:35 GMT
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండురోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న ఆ పార్టీలో ఊహించిన‌ట్ల‌గానే ఉత్సాహాన్ని నింపింది. హైద‌రాబాద్‌లో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పి త‌న ప్ర‌సంగం ప్రారంభించడం గ‌మ‌నార్హం. శంషాబాద్‌ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. కర్నాటక రాష్ట్రంలో కార్యక్రమం ఆలస్యంగా జరిగిందని..ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు రాహుల్ త‌న హుందాత‌నాన్ని వెల్లడించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో మహిళలతో చిట్ చాట్ చేశారు. మ‌హిళలు అడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన‌ రాహుల్ దేశం ముందుకు వెళ్లాలంటూ మహిళలకు రాజకీయంగా ఎదగాలని అన్నారు. మహిళలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు.

ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం, తెలంగాణలోని కేసీఆర్‌ సర్కార్ దొందూ దొందేన‌ని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద పారిశ్రామిక‌వేత్త‌ల‌కే లోన్స్ ఇస్తున్నారు కానీ..చిన్న వ్యాపారస్తులు - రైతులు - మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో లోన్స్ ఇవ్వడంలేదని రాహుల్ తెలిపారు. గత రెండేళ్లుగా ఢిల్లీలో ఉన్న ఎన్డీయే సర్కార్ 15 మంది పారిశ్రామిక వేత్తలకు ఎంత రుణం మాఫీ చేసిందో తెలుసా ? అని సమావేశాన్ని ఉద్ధేశించి ప్రశ్నించారు. రూ. 2.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఎన్డీయే పాలనలో రైతులు..మహిళలు..డ్వాక్రా సంఘాలకు మాత్రమే రుణం మాఫీ కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు చెందిన వడ్డీ భారం...అభయ హస్తం పథకాన్ని పునరుద్దరిస్తామన్నారు. దేశం ముందుకు పోవాలంటే మహిళలు..రాజకీయంగా..ఆర్థికంగా ముందుకు వెళ్లాలని..దీనికి కాంగ్రెస్ ప్రోత్సాహిస్తుందన్నారు. మహిళా సంఘ సభ్యులు లోన్ల కోసం అడిగితే సాధ్యం కాదని చెబుతున్నారని రాహుల్‌ చెప్పారు. తెలంగాణ మహిళా సంఘాల సభ్యులను పూర్తిగా నమ్ముతున్నానని..10 ఏళ్ల క్రితం యూపీలో మహిళా సంఘాలను నడపడం సాధ్యం కాదన్నారని..ఇప్పుడు దేశవ్యాప్తంగా సంఘాల సంఖ్య పెరగటం గర్వకారణం అన్నారు. తమ ప్రభుత్వంలో మహిళ సంఘాలకు చేయూతనిచ్చామన్నారు.ఢిల్లీ - రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని చెప్పిన రాహుల్..కాంగ్రెస్ మాత్రం మహిళలతో ముందుకెళ్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.

GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ కాదని..గబ్బర్ సింగ్ టాక్స్ అని రాహుల్ ఎద్దేవా చేశారు. సంవత్సరానికి 2కోట్ల ఉద్యాగాలిస్తామని చెప్పిన మోడీ మాట తప్పారని రాహుల్ ఆరోపించారు. నిరుపేదలకి అనారోగ్యం కారణంగా లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నిస్తామని రాహుల్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. నవంబర్ 8న నోట్ల రద్దుతో దేశాన్ని ఆగం చేశారని, పేద ప్రజలను గంటలతరబడి బ్యాంకులను లైన్లలో ఉంచాడు తప్పా..ఏ ఒక్క ధనవంతుడూ లైన్లలో నిలబడలేదని రాహుల్ చెప్పారు. దేశంలో ఉన్న అవినీతిపరులందరూ బ్యాంకుల్లో వెనకాల నుంచే డబ్బులు అందజేశారని చెప్పారు. బ్యాంకుల్లో 12 లక్షల కోట్లు పనికిరాని కాగితాల్ల్గ మిగిలిపోయాయని చెప్పారు. మోడీ ఏమో నల్లధనంపై పోరాటం చేస్తానన్నారు..ఇదేనా నల్లధనం అని ప్రశ్నించారు. తెలంగాణలో మొత్తం ఒకే కుటుంబం బాగుపడుతోంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Tags:    

Similar News