హైదరాబాద్ కు గాంధీ ఫ్యామిలీ.. కారణం ఇదేనట

Update: 2022-10-22 03:29 GMT
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు సంబంధించిన కీలక పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోనున్నాయి. పాదయాత్ర మొదలైన కేరళలో కానీ.. కర్ణాటక.. తమిళనాడు.. ఏపీలోనూ చోటు చేసుకోని సీన్ ఒకటి తెలంగాణలో ఆవిష్కృతం కానుంది. మరో రోజులో తెలంగాణలోకి అడుగు పెట్టనున్న రాహుల్ గాంధీ.. మునుగోడు ఉప ఎన్నికకు సరిగ్గా రెండు రోజులు ముందు ఆయన పాదయాత్ర గ్రేటర్ హైదరాబాద్ కు చేరుకోనుంది.

నవంబరు ఒకట్రెండు తేదీల్లో రాహుల్ పాదయాత్ర హైదరాబాద్ కు చేరుకోనుంది. మునుగోడు ఉప ఎన్నికకు సరిగ్గా ఒక రోజు ముందు హైదరాబాద్ కు చేరుకునే ఈ పాదయాత్రకు మరో ప్రత్యేకత ఏమంటే.. గాంధీ కుటుంబ సభ్యులంతా భాగ్య నగరానికి రానున్నారు. నవంబరు ఒకటిన శంషాబాద్ లోని మాతా టెంపు నుంచి మొదలయ్యే పాదయాత్ర.. బహుదూర్ పురా.. చార్మినార్.. గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది.

ఇందిరమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడే బహిరంగ సభను రాహుల్ నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో బస చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే పాదయాత్ర రాహుల్ తో పాటు తల్లి సోనియా.. సోదరి ప్రియాంకలు కూడా కలిసి నడుస్తారని చెబుతున్నారు.

ఇప్పటివరకు భారత్ జోడో యాత్రలో రాహుల్ ను ఫోకస్ చేయగా.. తెలంగాణలో మాత్రం ఇందిరమ్మను ఎక్కువగా ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మకు ఎక్కువ ఆదరణ ఉండటమే.

రాహుల్ భారత జోడో యాత్ర  ఆదివారం తెలంగాణలో ఆరంభం కానుంది. కర్ణాటక లోని రాయ్ చూర్ నుంచి క్రిష్ణా నది బ్రిడ్జి మీదుగా నారాయణ్ పేట జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మొదటిరోజున 18 కిలోమీటర్లు మేరనడిచి మక్తల్ చేరుకుంటారు. సోమ.. మంగళవారాలు పాదయాత్రకు విరామం ఇచ్చి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీపావళి.. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి రాహుల్ హాజరు కానున్నారు. అనంతరం మళ్లీ తెలంగాణకు వచ్చి పాదయాత్రలో పాల్గొననున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News