ప‌వ‌న్ ఓటు మార్పు వెనుక ప్లాన్ వేరేన‌ట‌

Update: 2016-11-01 05:47 GMT
సినీ నటుడు - జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తీసుకున్న నిర్ణ‌యం మ‌రోమారు సంచ‌నాల‌కు వేదిక‌గా మారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జనసేన నేతలు హైద‌రాబాద్‌ లో తనను కలిసినపుడు వారితో ప‌వ‌న్ మాట్లాడుతూ  తన పేరును స్థానిక‌ ఓటర్ల జాబితాలో న‌మోదు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు పార్టీకి ఆదేశం కూడా ఇచ్చేవారు. తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పేరు నమోదు చేసుకోవాలని నిర్ణయించడం వెనుక కార‌ణాలు వేరేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. హైదరాబాద్‌ లోని జూబ్లిహిల్స్ లో  గ‌ల‌ తన నివాసం చిరునామాతో పవన్‌ ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికతో పాటు అంతకు ముందు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన హైదరాబాద్‌ లోనే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే హఠాత్తుగా పవన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అది కూడా తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి అందులోనూ ఏలూరులో తన పేరును ఓటరు జాబితాలో మార్పించుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనక ఏదో దాగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ ఏలూరు నుంచి అసెంబ్లికి పోటీచేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ నెలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగే నగర పాలకసంస్థలు, పురపాలక సంఘం ఎన్నికల్లో తన పార్టీ జనసేన తరఫున అభ్యర్థులను బరిలోకి దింపాలని ఇప్పటికే ఆయన నిర్ణయించారని - అందువల్లే ఓటరు జాబితాలో తన పేరును మార్పు చేసుకోవాలన్న ప్రతిపాదనకు వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ప‌వ‌న్ త‌న ఓటు హ‌క్కును మార్చుకోవ‌డ‌మే కాకుండా ఏలూరులో తాను నివాసం ఉండేందుకు వీలుగా ఒక ఇంటిని కూడా వెతికి పెట్టాలని ఏలూరుకు చెందిన అభిమానుల‌కు ఆదేశించారు. ప‌వ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక వివిధ అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ప‌వ‌న్ హైద‌రాబాద్‌ లోని తన మ‌కాంను జూబ్లిహిల్స్‌ నుంచి ఏలూరుకు మారుస్తారా? లేక అప్పుడప్పుడు, తీరిక సమయంలో అక్కడికి వెళ్ళి పార్టీ కార్యకలాపాలను ఏలూరు నుంచి కొనసాగిస్తారా అన్నది తేలవలసి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని అసెంబ్లి - లోక్‌ సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని అగ్రగామిగా నిలిచింది. ఏపీ సీఎం చంద్రబాబు పార్టీపరంగా ఏ సమావేశం జరిగినా పశ్చిమ గోదావరి జిల్లాను ప్రస్థావించి ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటని - ఈ జిల్లా ప్రజలను తానెప్పుడూ మరిచిపోనని చెబుతుంటారు. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఉన్న ప్రాబల్యాన్ని తగ్గించేందుకే పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలను ప్రారంభించి ప్రత్యేక దృష్టి సారించేందుకు ప్రణాళికలు రూపొందించారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత‌కీ జ‌న‌సేనాని మ‌న‌సులో ఏముందో మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News