మ‌ళ్లీ ఢిల్లీకి రేవంత్‌..ఇప్పుడు భారీ ఎజెండాతో

Update: 2017-10-29 04:53 GMT
తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మాజీ ఏ.రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలువనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ త్వ‌ర‌లో సమావేశమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ పెద్దలను కలిసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తనతో పాటు 20మంది తెదేపా నేతలు కాంగ్రెస్‌ లో చేరుతారంటూ ఇప్పటికే రాహుల్‌ ను కలిసి జాబితాను సమర్పించిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి చురుకైన యువ కార్యకర్తలను పెద్దఎత్తున తీసుకురావలసిందిగా రేవంత్‌ కు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ యువకులకు ప్రాధాన్యత ఇవ్వనుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యావంతుల యువకులను కాంగ్రెస్‌ లోకి చేర్పించేందుకు ప్రయత్నించాలని రాహుల్‌ చెప్పినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపాలోని యువకులతో పాటు సీనియర్లను కూడా తనతో పాటు తీసుకువెళ్ళేందుకు రేవంత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఇందుకోసం జిల్లాలోని విద్యావంతుల యువకులను తనవైపు తిప్పుకుని కాంగ్రెస్‌ లో చేర్పించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. రాహుల్‌ సూచన మేరకు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించిన రేవంత్‌ మరో జాబితాను సిద్ధంచేసి రాహుల్‌ ను కలువనున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌ రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో తెదేపా నుంచి ఎక్కువ మంది నేతలను తనవెంట తీసుకువెళ్ళేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 20 మందితో జాబితాను రూపొందించి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఇచ్చిన రేవంత్‌ మరో జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి జాబితాలో జిల్లా స్థాయి నాయకుల పేర్లు చేర్చగా - మలి జాబితాలతో సీనియర్లను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనతో పాటు సీనియర్లను కూడా కాంగ్రెస్‌ లో చేర్పించేందుకు సంప్రదింపులు చేస్తూ రాహుల్‌ ఇచ్చిన హామీలను వారికి వివరిస్తున్నట్లు సమాచారం. తనతో పాటు వచ్చే వారందరికీ కాంగ్రెస్‌ లో పదవులు ఇస్తారనే విధంగా ఆశ పెడుతూ వారిని కాంగ్రెస్‌ లోకి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం గత రెండు రోజులుగా ఫోన్ల ద్వారా సంప్రదింపులు చేస్తున్న రేవంత్‌ శనివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలిసింది.

ఇప్పటికే రాహుల్ తో రెండు సార్లు భేటీ అయిన రేవంత్.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారు. రేవంత్ కాంగ్రెస్‌ లో చేరనున్నారని ఇటీవల కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపధ్యంలో రేవంత్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి - పార్టీ పదవులకు రాజీనామా చేశారు. భారీ సంఖ్యలో తరలిరానున్న అనుచరులు - అభిమానులు - కార్యకర్తలతో కలిసి.. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Tags:    

Similar News