ప‌వన్ పుస్త‌క ప‌ఠ‌నం కామెడీ పాల‌యింది

Update: 2018-04-29 06:48 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప‌రిజ్ఞానాన్ని చాటుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నం న‌వ్వుల‌పాల‌యింది. త‌ను ఎంత విజ్ఞాన‌వంతుడినో తెలియ‌జెప్పేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం ఆయ‌న్ను బుక్ చేసింది. దీంతో నెటిజ‌న్లు ప‌వ‌న్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..జ‌నసేనాని ఇటీవ‌ల ట్విట్ట‌ర్ వేదిక‌గా దూకుడుగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న భావాల‌ను - విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ట్వీట్ల ద్వారానే వెల్ల‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప‌వ‌న్ ఓ ట్వీట్ చేశారు. ప్రముఖ న్యాయకోవిదుడైన నానీ ఫాల్కీవాలా రాసిన `వియ్‌ ద నేషన్: ది లాస్ట్ డికేట్స్' అన్న న్యాయగ్రంథాన్ని తాను 1980లో చదివాన‌ని పేర్కొన్నారు. ఆ పుస్త‌కాన్ని చ‌దివి అందులోని రాజకీయాన్ని అర్థం చేసుకుని - పెద్దయ్యాక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

అయితే ప‌వ‌న్ చెప్పిన ఈ పుస్త‌కం వ‌ర‌కు ఓకే కానీ అందుకు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చిన తీరే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందంటున్నారు. ప‌వ‌న్ ఈ వివ‌రాలు పెట్ట‌గానే ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అనుకోవ‌చ్చు..కొంద‌రు నెటిజ‌న్లు అనుకోవ‌చ్చు ఎదురుదాడికి రంగం సిద్ధం చేశారు. వికీపీడియా ప్రకారం పవన్ వయసు ఇప్పుడు 46 ఏళ్లు. నానీ ఫాల్కీవాలా ఆ పుస్తకం రాసి విడుదల చేసింది 1994లో. కానీ పవన్ తాను  పుస్తకాన్ని నాలుగవ తరగతి చదువుకున్నప్పుడే సదరు న్యాయ గ్రంధాన్ని చదివాన‌ని పేర్కొన్నారు. అంటే ప‌వ‌న్ చెప్పిన లెక్క‌లు - పుస్త‌కం ప్ర‌చుర‌ణ స‌మ‌యం బ‌ట్టి చూస్తే చిత్ర‌మైన విష‌యాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. పవన్ చిన్నతనంలోనే ఈ పుస్తకాన్ని ఎలా చదివారు? అసలు పుస్తకం విడుదలయిందే 1994లో అయితే, పధ్నాలుగేళ్ల ముందే పవన్ దానిని ఎలా చదివారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఒక‌వేళ నానీ ఫాల్కీవాలా తాను రాసిన చిత్తు ప్రతిని కల్యాణ్‌ కు ముందుగానే ఇచ్చారా? అంటూ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నానీ ఫాల్కీవాలా అప్పట్లో తెలుగుమీడియం చదువుకుంటున్న పవన్ కు తన పుస్తకాన్ని సమీక్షకు ఇచ్చినట్లు అర్ధం చేసుకోవలా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News