కాంగ్రెస్ కథ ముగియలేదు.. మేధావి శశి మాటలు వింటే కొత్త ఊపు ఖాయం

Update: 2022-03-15 03:32 GMT
ఇప్పుడంతా మారిపోయింది. గతానికి భిన్నంగా ఎప్పటికప్పుడు వాదనలు వినిపించటం.. దానికి ఏదో ఒక అంశాన్ని రిఫరెన్సు చూపించటం ఎక్కువైంది. ఒక ఎన్నికల్లో గెలిస్తే.. ఇక ఆ పార్టీకి.. పార్టీ అధినేతకు తిరుగులేదని.. అదే సమయంలో ఇంకో పార్టీ ఓడితే.. ఇంకేం ఉంది.. పార్టీ పని అయిపోయిందన్నట్లుగా మాట్లాడటం.. దానికి తగ్గట్లుగా వాదనలు వినిపించటం ఇప్పుడు అలవాటైంది. అయితే.. అలాంటి వేళలో.. మిగిలిన వారికి భిన్నంగా వాదనలు వినిపించేవారు.. అది కూడా శాస్త్రీయంగా ఉన్న మాటల్ని.. వాదనల్ని విన్నప్పుడు.. అప్పటివరకు విన్న వాదనల్లో పస లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించటం తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో.. కాంగ్రెస్ పని అయిపోయిందని.. బీజేపీకి తిరుగులేదని.. మోడీ ఇమేజ్ భారీగా పెరిగినట్లుగా లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల్లో వచ్చే ఫలితాలు.. ప్రజాభిప్రాయానికి నిదర్శనమనుకోవటంలో తప్పు ఉంటుంది. ఎందుకంటే.. ఎన్నికలు రకరకాల రాజకీయ సమీకరణలకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పొత్తులతో పవర్ లోకి వస్తే.. మరికొన్నిసార్లు కలవాల్సిన కాంబినేషన్లు కలవని కారణంగా అధికారానికి దూరం కావాల్సి వస్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఇక ఆ పార్టీ పని కంచికి వెళ్లిపోయినట్లుగా పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇలాంటివేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మేధావిగా పేరున్న శశిథరూర్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఆయన వాదనను విన్నప్పుడు.. ఆయన చెప్పింది నిజమే కదా? అన్న భావన వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో మరెప్పుడూ లేని రీతిలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిందన్న మాట వినిపిస్తున్న వేళ.. అందరూ విశ్లేషిస్తున్నంతగా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఏమీ లేదని ఆయన చెబుతున్నారు. అదెలా అన్నది ఆయన విశ్లేషణలోనే చూస్తే..

‘‘దేశవ్యాప్తంగా అసెంబ్లీ స‌భ్యుల నంబ‌ర్ల‌ను ప‌రిశీలిస్తే... భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఉన్న బ‌లం 1443. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 753. బీజేపీ చేతిలో అత్యంత కీల‌క‌మైన యూపీ ఉంది. మ‌రోసారి భారీ సంఖ్య‌లో సీట్లను సొంతం చేసుకోవటం ద్వారా ఆ పెద్ద రాష్ట్రంలో పవర్లోకి వచ్చింది. బీజేపీ యూపీతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో పవర్ లో ఉంది. కమలం పార్టీకి తిరుగే లేదని చెబుతున్న వేళలోనూ.. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఏకంగా 753 అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ బలం చాలా స్వల్పంగా ఉంది. అయితే.. రాష్ట్రాల అసెంబ్లీ వారీగా చూస్తే.. ఇది మెరుగైన అంకెలే కనిపిస్తాయి’’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా ఉన్న 753 మంది ఎమ్మెల్యేలతో పోలిస్తే.. టీఎంసీ 236 మంది ఎమ్మెల్యేలతో మూడో స్థానంలో.. 156 మంది సభ్యులతో ఆమ్ ఆద్మీ నాలుగో పెద్ద పార్టీగా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ఐదో స్థానంలో ఉంది. ఇంత బలం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ మరీ లేదన్న భావనకు కారణం సోనియా కంటే కూడా.. ఆమె రాజకీయ వారసులుగా చెప్పే రాహుల్.. ప్రియాంకలేనని చెప్పాలి.

ఎందుకంటే.. మాస్టర్ మైండ్ మోడీషాలను ఢీ కొట్టే విధానాన్ని.. వారిని క్రాక్ చేసే వైనాన్ని సరిగా వంటపట్టించుకోవటంలో కాంగ్రెస్ వెనుకబడి ఉందని చెప్పక తప్పదు. ఇదే.. ఆ పార్టీకి గెలుపు  కంటే కూడా ఓటమి అదే పనిగా దగ్గర అవుతుందని చెప్పాలి.  మరెప్పటికి ఆ పార్టీ తన తప్పుల్ని తెలుసుకుంటుందన్న దాని మీదనే విజయం దగ్గరయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News