గవర్నరుగా నజీబ్ జంగ్ పేరు? బాబుకు కంగారు

Update: 2018-01-11 16:25 GMT
తెలుగు రాష్ర్టాల గవర్నరు నరసింహన్‌ పై బీజేపీ నేతలు విరుచుకుపడడం మొదలవడంతో ఆయన్ను మార్చేసే టైమొచ్చిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఏపీకి కొత్త గవర్నరు ఎవరన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. ప్రధానంగా నాలా బిల్లును గవర్నరు తిప్పి పంపిన నేపథ్యంలో ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తొలుత ఆయనపై విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఆయన విరుచుకుపడడంతో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు కూడా గవర్నరుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ఆ పార్టీ పెద్దల వద్దకు కూడా విషయం తీసుకెళ్లారని, ఆయన్ను మార్చేస్తారని ప్రచారం జరిగింది. అంతవరకు బాగానే ఉన్నా ఆయన ప్లేసులో ఎవరొస్తారన్న విషయంలోనూ పలు పేర్లు వినిపించాయి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించి గవర్నరు మార్పు వరకు వెళ్లకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నాలా బిల్లుపై గవర్నరు అభ్యంతరాలకు సమాధానమిచ్చి బిల్లు పాసయ్యేలా చేసి - బీజేపీ నేతల గొడవ అక్కడితో ఆగేలా చేశారని తెలుస్తోంది.
    
అయితే.. గతంలో టీడీపీ నేతలు కూడా విమర్శించిన గవర్నరు నరసింహన్‌ నే ఇంకా కొనసాగించాలని చంద్రబాబు ప్రయత్నించడం వెనుక కారణమేంటన్న విషయంలోనూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నరు ఏపీకి అంత అనుకూలంగా లేరన్న అభిప్రాయం ఉన్నప్పటకీ - ఒకవేళ ఆయన్ను మారిస్తే ఆయన స్థానంలో ఎవరొస్తారన్న విషయంలో వినపడిన పేర్లు చంద్రబాబును కంగారు పెట్టాయని తెలుస్తోంది.
    
ముఖ్యంగా దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నరు నజీబ్ జంగ్‌ ను ఏపీ గవర్నరుగా నియమించొచ్చని ఊహాగానాలు రావడంతో చంద్రబాబు ఆ పరిస్థితి రాకుండా చేసినట్లు తెలుస్తోంది. జంగ్ దిల్లీ లెఫ్టినెంటు గవర్నరుగా ఉన్నప్పుడు ఆయన కేంద్రం చెప్పినట్లంతా విని  సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను ఆడుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో జంగ్ కంటే నరసింహనే నయమని జాగ్రత్త పడినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.


Tags:    

Similar News