ఒకే వేదిక‌పై ముగ్గురు అగ్ర నేత‌లు.. ఏం జ‌ర‌గ‌నుంది?

Update: 2022-09-13 08:44 GMT
ప్ర‌పంచ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు అగ్ర నేత‌లు ఒకే వేదిక‌పై క‌లుసుకోనున్నారు. ఈ ముగ్గురిలోనూ ఇద్ద‌రు రెండు శ‌త్రు దేశాల‌కు చెందిన వారు కావ‌డంతో ఈ ముగ్గురు నేత‌ల భేటీపై ఆస‌క్తి నెల‌కొంది. సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 వ‌ర‌కు ఉజ్బెకిస్థాన్‌లో జ‌ర‌గ‌నున్న షాంఘై స‌హ‌కార సంస్థ‌ (ఎస్‌సీవో) స‌మావేశం ఇందుకు వేదిక కానుంది.

ఉజ్బెకిస్థాన్‌లో స‌మావేశం కానున్న ముగ్గురు అగ్ర నేత‌లు మ‌రెవ‌రో కాదు.. ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జీ జిన్ పింగ్, భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ ముగ్గురు ఒక‌టి రెండు రోజుల్లో స‌మావేశం కాబోతున్నారు. దీంతో వీరి ముగ్గురి భేటీపై ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తి చూపుతున్నాయి.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఓవైపు ర‌ష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం కొన‌సాగిస్తూనే ఉంది. మ‌రోవైపు చైనా.. తైవాన్ పై యుద్ద స‌న్నాహాలు చేస్తోంది. ఇంకోవైపు క‌శ్మీర్లో గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్ కు చెందిన సైనికుల‌ను చైనా హ‌త‌మార్చాక ఇరు దేశాల సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్‌, ర‌ష్యా, చైనాల‌కు చెందిన ముగ్గురు అగ్ర నేత‌లు భేటీ కానుండ‌టం ఆస‌క్తి రేపుతోంది.

మ‌రోవైపు చైనా అధినేత జీ జిన్‌పింగ్ చైనా దాటి రెండేళ్లు దాటిపోయింది. 2020 జ‌న‌వ‌రిలో పొరుగు దేశం మ‌య‌న్మార్ లో ప‌ర్య‌టించ‌డం మిన‌హా గ‌త రెండేళ్లు క‌రోనాతో ఆయ‌న బ‌య‌ట (విదేశాల్లో) కాలుపెట్ట‌లేదు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్‌ పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా పాల్గొంటార‌ని చెబుతున్నారు.

షాంఘై కోఆప‌రేష‌న్ లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమైంది.

వీరి ముగ్గురి భేటీని అమెరికా ఆసక్తిగా పరిశీలిస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న ర‌ష్యా ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతుండ‌టం, తైవాన్ ను బెదిరిస్తున్న చైనా అధినేత జీ జిన్ పింగ్ కూడా ఈ స‌మావేశానికి వ‌స్తుండ‌టంతో అమెరికా ఆగ్ర‌హంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌ష్యా మీద అమెరికా, దాని మిత్ర దేశాలు, యూరోపియ‌న్ కంట్రీస్ ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే.

కాగా ప్ర‌ధాని నరేంద్ర మోదీ, చైనా అధ్య‌క్షుడు జీ జిన్ పింగ్ మ‌ధ్య చ‌ర్చ‌లు చోటు చేసుకుంటాయా? చ‌ర్చ‌లు జ‌రిగితే భార‌త్ అభ్యంత‌రాల‌ను మోడీ ఆయ‌న దృష్టికి తీసుకెళ‌తారా అనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News