కొవాక్జిన్‌ ట్రయల్స్ .. టీకా తీసుకున్న ఇద్దరు వలంటీర్ల డిశ్చార్జ్‌

Update: 2020-07-22 08:10 GMT
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని చాలా దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రష్యా , అమెరికా దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. అవి చివరి దశలో ఉన్నాయి. ఈ తరుణంలోనే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్ కరోనా ను అరికట్టడానికి‌ అభివృద్ధి చేసిన కొవాక్జిన్ ‌ను సోమవారం నిమ్స్‌లో ఇద్దరు వలంటీర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ  ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్‌ వైద్యులు తెలిపారు.

అయితే ,  14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్‌ లోని కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీ ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. రోజూ ఫోన్, వీడియో కాల్స్‌ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తామన్నారు. టీకాలోని అచేతన (అన్‌యాక్టివేటెడ్‌) వైరస్‌ వల్ల శరీరంలో యాంటీబాడీస్‌ ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు. అన్ని బాగుంటే  వారికే రెండో డోస్ వ్యాక్సిన్  ఇస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ క్లినిక ల్‌ ట్రయల్స్‌ దిశగా  నిమ్స్‌  తొలి అడుగు సక్సెస్ అయింది అని చెప్పవచ్చు. కొవాక్జిన్‌ హ్యూమన్  ట్రయల్స్  తొలి ప్రయత్నం విజయవంతం కావడం పై  నిమ్స్‌ క్లినికల్, ఫార్మకాలజీ విభాగం వైద్యులు హర్షం వ్యక్తంచేశారు.

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌ వైద్యులు 13 మంది వలంటీర్ల రక్త నమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ ఆమోదించిన ల్యాబ్‌కు పం పించారు. వీరిలో 8 మందికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే బుధవారం మరో ఇద్దరికి టీకా డోస్‌ ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్ ‌లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు. మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదు డోస్‌ లలో టీకా ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాన్ని రెండు , మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. అందులో వ్యాక్సిన్ సక్సెస్ అయితే ,  ఈ ఏడాది చివరన కానీ ,2021 మొదట్లో కానీ   వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని నిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News