సీఎం జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు?

Update: 2022-04-06 00:37 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత బిజీగా ఉంటారో తెలుసు. ఆయన్ను కలుసుకునేందుకు చాలామంది ముఖ్యమంత్రులు అనుకున్నా.. ఆయన అపాయింట్ మెంట్ దొరకదు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుకోవాలే కానీ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో ప్రధాని మోడీ ఉదారంగా వ్యవహరిస్తారని చెబుతారు. ఎన్ని పనులున్నా.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమయం ఇచ్చే విషయంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మోడీకి - జగన్ కు మధ్యనున్న అనుబంధం తండ్రీ కొడుకుల మాదిరి ఉంటుందని చెప్పటం తెలిసిందే.

ఇందుకు తగ్గట్లే తాజాగా సీఎం జగన్ కోరటం.. ప్రధాని మోడీతో భేటీ కావటం జరిగిపోయాయి. ఇప్పటికిప్పుడు ప్రధాని మోడీని ఎందుకు కలిసినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తల్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రత్యేక కారణాలేమీ కనిపించవు.  ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు.. విభజన సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న ఎజెండాతో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు చెబుతున్నా.. అందులో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

కొంతకాలం క్రితమే ప్రధానితో సీఎం జగన్ భేటీ కావటం.. ఆ సందర్భంలోనూ ఇదే మాట చెప్పటం తెలిసిందే. కోరినంతనే సీఎం జగన్ కు టైమిచ్చే ప్రధాని మోడీ.. ఆయన తీసుకెళ్లే సమస్యల చిట్టాను మాత్రం ఎందుకు పరిష్కరించటం లేదన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణ నుంచి రూ.6వేల కోట్లు ఏపీకి రావాలన్న అంశం ఇప్పటిది కాదు. ఏళ్లకు ఏళ్లుగా నడుస్తోంది. అయినప్పటికీ అది ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశాన్ని ఎజెండాగా పెట్టుకొని ప్రధాని మోడీని కలిసిన సందర్భాలు లేకపోలేదు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన సీఎం జగన్.. మంగళవారం సాయంత్రం ప్రదాని మోడీతో సమావేశం కావటం.. వీరి భేటీ ఏకంగా గంటకు పైగా సాగటం గమనార్హం. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్ని ప్రధానమంత్రికి సీఎం జగన్ వివరించినట్లు చెబుతున్నారు. అయితే.. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా రాజకీయ వర్గాలు వినిపిస్తున్న వాదన మరోలా ఉంది.

తాజాగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. దానికి సంబంధించిన కసరత్తు సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రధాని మోడీకి వివరించేందుకు జగన్ వెళ్లారన్న మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు.. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుండటం.. దానికి సంబంధించిన ప్రయోగాన్ని ప్రధానితో షేర్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇది పూర్తిగా పార్టీకి సంబంధించిన కీలక నేతల అంచనా మాత్రమేనని చెప్పాలి. మరికొన్ని "కీలక" అంశాల్ని ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు.

ప్రధాని మోడీతో పాటు.. ఆయనకు కుడిభుజం అయిన అమిత్ షా.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు మరో కేంద్ర మంత్రి షెకావత్ తోనూ భేటీ అయ్యారు. ఈ రోజు (బుధవారం) ఆయన గడ్కరీతో భేటీ కానున్నారు. దాదాపు మూడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సీఎం జగన్.. కేంద్రానికి విన్నవించే వినతుల విషయంలో ఇప్పటివరకు సాధించిందేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News