'థాంక్యూ' ఫలితం దిల్ రాజు ఆలోచనలో మార్పు తీసుకొచ్చిందా..?

Update: 2022-07-27 05:30 GMT
టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు దిల్ రాజు. ఆయన బ్యానర్ లో ఓ సినిమా వ‌స్తోందంటే మిగతా అంశాలేవే పట్టించుకోకుండా.. క‌థాబ‌ల‌మున్న సినిమాలు లేదా ఏదో ఓ విష‌యం ఉంటుంద‌ని ప్రేక్షకుల్లో ఓర‌క‌మైన న‌మ్మ‌కం ఏర్పరచుకున్నాడు. దిల్ రాజు జ‌డ్జ్‌మెంట్ పై అంత భ‌రోసా ఉండగా.. లేటెస్టుగా వచ్చిన 'థ్యాంక్యూ' సినిమాతో ఆ నమ్మకం పై పూర్తిగా దెబ్బపడినట్లైంది.

దిల్ రాజుకు ఫ్లాపులు కొత్తేమీ కాదు. కాకపోతే 'థాంక్యూ' సినిమాపై ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఎమోషనల్ గా గొప్పగా మాట్లాడారు. ఈ క‌థ త‌న‌ని చాలా మార్చింద‌ని అన్నాడు. కానీ సినిమా చూసిన తర్వాత కథలో అంతగా ఏమీ లేదని కామెంట్స్ చేశారు. దిల్ రాజు జడ్జిమెంట్ పైనే సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో అగ్ర నిర్మాత ఆలోచనలో మార్పులు వచ్చాయని నెట్టింట టాక్ నడుస్తోంది.


దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న భారీ సినిమా RC15. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు షోమ్యాన్ శంకర్ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది శంకర్ తరహాలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం.

వాస్తవానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మించే ప్రతి సినిమా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్ లో సినిమా షూటింగ్ పూర్తయ్యేలా చూసుకుంటారని.. పెద్ద ప్రాజెక్ట్ చేసినా బడ్జెట్ మాత్రం కంట్రోల్ లోనే ఉంటుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.

కానీ RC15 విషయంలో మాత్రం దిల్ రాజు తన పద్ధతిని పక్కన పెట్టి.. బడ్జెట్ విషయంలో డైరెక్టర్ శంకర్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని టాక్ ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందే మైలురాయి 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడటం లేదని అనుకున్నారు.

ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్ గా తెరపై ఆవిష్కరించే శంకర్.. తన గత చిత్రాల స్థాయిలోనే రామ్ చరణ్ సినిమాని భారీ ఎత్తున ప్లాన్ చేసాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ' సినిమా ప్లాప్ అవడంతో దీని ప్రభావం ఇప్పుడు RC15 పై పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

యువసామ్రాట్ నాగ చైతన్య మరియు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'థాంక్యూ' సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దర్శక హీరోల కెరీర్ లోనే ఇది అతిపెద్ద పరాజయంగా పరిగణించబడుతోంది. అంతేకాదు ఇది దిల్ రాజు జడ్జిమెంట్ పైనా.. అతని ఇతర ప్రాజెక్ట్స్ పైనా సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది.

'థాంక్యూ' ఫ్లాప్ కావడంతో దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందే సినిమాలపై భారీగా ఖర్చు చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే కొన్ని చిన్న మరియు మీడియం బడ్జెట్ చిత్రాలను హోల్డ్‌ లో ఉంచారనే టాక్ ఉంది. అంతేకాదు RC15 లో రెండు పాటలను శంకర్ లావిష్ గా ప్లాన్ చేస్తుండగా.. నిర్మాత మాత్రం పునరాలోచలో పడ్డారట.

RC15 అనేది దిల్ రాజుకు టేబుల్ ప్రాఫిట్ వెంచర్ అని చెప్పాలి. థియేట్రికల్‌ తో పాటు డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులతో సహా అన్ని భాషలలో ఈజీగా భారీ రేట్లకు అమ్ముడుపోతుంది. RRR తర్వాత చరణ్ నుంచి వచ్చే సినిమా కావడంతో కచ్చితంగా డిమాండ్ ఉంటుంది.

అయినప్పటికీ నిర్మాత మాత్రం ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నాడని.. దీనికి కారణం 'థాంక్యూ' సినిమా నష్టాలు తెచ్చిపెట్టడమే అని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ మేరకు శంకర్ ను ఒప్పించడానికి స్టార్ ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి.

కాగా, RC15 లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో మూడు విభిన్న పాత్రలను పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2023 సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Tags:    

Similar News