వీరసింహా రెడ్డికి మాత్రమే పూర్తి రెమ్యునరేషన్..!

Update: 2023-01-21 11:17 GMT
సంక్రాంతి బరిలో విడుదలైన వీర సింహారెడ్డి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను అందుకుంటూ... బాలయ్య బాబు అభిమానులను ఫుల్ కుష్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య బాబు వీరాభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సినిమా హిట్టవడంతో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ మరోసారి హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్తూ మురిసిపోతున్నారు. అలాగే తన రెమ్యునరేషన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పటి వరకు తీసిన ఏ ఒక్క సినిమాకు కూడా పూర్తి రెమ్యనరేషన్ రాలేదని స్వయంగా ఆయనే చెప్పారు. ఒక్క వీరసింహారెడ్డి సినిమాకు మాత్రమే తనకు పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని వివరించారు. రవితేజతో డాన్ శీను సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. బాడీ గార్డ్, బలుపు, పండుగ చేస్కో, విన్నర్, క్రాక్ సినిమాలు చేశారు. వీటన్నిటిలో విన్నర్ తప్ప మిగిలినవన్నీ హిట్లే. కానీ ఈ సినిమాల్లో ఓ ఒక్క సినిమాకు కూడా తనకు పూర్తి స్థాయిలో పారితోషికం అందలేదని మలినేని వివరించారు.

మాస్ మహారాజాతో కలిసి తీసిన క్రాక్ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ కూడా సినిమా రిలీజ్ అయి హిట్టు అయ్యాకే అందిందని గుర్తు చేశారు. ఆ విషయంలో చాలానే గొడవలు జరిగినట్లు తెలిపారు. వీరసింహా రెడ్డి సినిమా విషయానికి వస్తే.. మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్ మామూలుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్ తో పాటు ఇటు సెంటిమెంట్ ను బ్యాలెన్స్ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.

ఈ సినిమాలో నటించిన దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రుతి హాసన్, హనీ రోజ్ తమదైన శైలిలో నటించి మెప్పించారు. విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వీరసింహారెడ్డి ప్రపంచ వ్యాప్తంగా రూ.119 కోట్ల గ్రాస్ కెలక్షన్లను వసూలు చేసింది. అలాగే అమెరికాలోనే 1.04 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ల రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News