టాలీవుడ్ కి సీనియర్ హీరోయిన్ వారసురాలు!

Update: 2022-03-22 06:41 GMT
తెలుగు తెరపై 1990లలో గ్లామరస్ హీరోయిన్స్ గా మార్కులు కొట్టేసిన వారిలో మాలాశ్రీ ఒకరుగా కనిపిస్తారు. అంతకుముందు శ్రీదుర్గ పేరుతో ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఆమె ఆ తరువాత మాలాశ్రీ పేరుతో కథానాయికగా 'ప్రేమఖైదీ' చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఆ సినిమాతో ఆమె తెలుగులో బిజీ అయ్యారు. 'బావ బావమరిది' .. 'పరువు  ప్రతిష్ఠ' .. 'ఊర్మిళ' వంటి  హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావించారు.

మా అమ్మగారివాళ్లది భీమవరం .. నాన్నగారి వాళ్లది కలకత్తా.  అయితే నేను పుట్టి పెరిగింది మాత్రం మద్రాసులో. బాలనటిగా దాదాపు 35 సినిమాల్లో నటించాను. నాతో ఎక్కువగా అబ్బాయిల వేషాలే వేయించారు. అందువల్లనేనేమో ఆ ప్రభావం నాపై ఉంది. తెలుగులో ఓ పాతిక సినిమాలు చేసి ఉంటాను. బాలకృష్ణగారి 'రాము' సినిమాలో ఆయన చెల్లెలిగా చేశాను. ఆ తరువాత 'ప్రేమఖైదీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ  ఇచ్చాను. అంతకుముందు నా పేరు 'శ్రీదుర్గ'. కన్నడలో ఒక సినిమా చేస్తున్నప్పుడు రాజ్ కుమార్ గారి  శ్రీమతి పార్వతమ్మ నా పేరును 'మాలాశ్రీ'గా మార్చారు.

తెలుగులో 'సాహసవీరుడు సాగర కన్య' సినిమా చేసిన తరువాత నాకు 'రాము'తో పెళ్లి జరిగింది. ఆయన సినిమాలు  చేయడం వలన కలిగిన పరిచయం ప్రేమగా మారడం .. పెళ్లి  చేసుకోవడం జరిగిపోయింది. పెళ్లి తరువాత నేను  కన్నడలో ఫుల్  బిజీ అయ్యాను. అక్కడ లేడీ ఓరియెంటెడ్ కథలు ఎక్కువగా వచ్చాయి. ఆ సినిమాలను ఎక్కువగా చేస్తూ వెళ్లాను. దాంతో అక్కడ నాకు యాక్షన్ క్వీన్ అనే గుర్తింపు వచ్చింది. అలా అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన, తెలుగులో చేయలేకపోయాను. ఆ గ్యాప్ అలా పెరుగుతూ పోయింది .. అంతే.

మా అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తను నా సినిమాలు చూస్తూ పెరిగింది. తనకి సినిమాల్లోకి రావాలని ఉంది. తనకి కన్నడ కంటే తెలుగు సినిమాలంటే పిచ్చి. హీరోయిన్ గా ఫస్టు తెలుగు సినిమా చేస్తానని నాతో అంటూ ఉంటుంది. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే ఒక ఆలోచనకి ఆమె వచ్చేసింది. ఇక మా అబ్బాయిని కూడా మాస్  హీరోను చేయాలని మా వారికి ఉండేది. అయితే ముందుగా డిగ్రీ పూర్తి కావాలనే ఉద్దేశంతో ఆపాను. త్వరలోనే వాళ్ల నాన్న కోరిక ప్రకారం వాళ్లను ముందుకు తీసుకుని వెళతాను" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News