ఆ ఒక్క విషయంలోనే 'భీమ్లా' ఫ్యాన్స్ నిరాశ చెందారు..!

Update: 2022-02-26 06:30 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి.. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ డే రెస్పాన్స్ ను బట్టి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'అయ్యప్పనుమ్ కొశీయుమ్' అనే మలయాళ సినిమా రీమేక్ గా 'భీమ్లా నాయక్' తెరకెక్కింది. తెలుగులో పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మాతృకలో పలు మార్పులు చేర్పులు చేశారు. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య వైరాన్ని చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సాగర్ కే చంద్ర టేకింగ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే చిత్రాన్ని అద్భుతంగా నడిపాయని అంటున్నారు.

నువ్వా నేనా అంటూ పోటాపోటీగా నటించిన పవన్ - రానా.. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన ఎస్ఎస్ థమన్ ల గురించి ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఆశించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ కావడంతో 'భీమ్లా నాయక్' ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం నిరాశకు గురవుతున్నారు.

భీమ్లా చిత్రంలో అన్ని పాటలు ఆడియన్స్ ను అలరించాయి. వాటిలో థమన్ స్వరపరిచిన 'అంత ఇష్టం' అని పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. గీయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు. పవన్ కళ్యాణ్ - హీరోయిన్ నిత్యా మీనన్ మధ్య సాగిన ఈ సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయింది.

అయితే తీరా 'భీమ్లా నాయక్' సినిమా విడుదలయ్యాక చూస్తే అందులో అంత ఇష్టం పాట లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అంత మంచి సాంగ్ ను సినిమా నుంచి తొలగించడానికి కారణాలు ఏంటని మేకర్స్ ను ప్రశ్నిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. పవన్ - నిత్యా మధ్య ప్రేమ కోణాన్ని మరింతగా ఆవిష్కరించేదేమో అని అంటున్నారు.

ఒకవేళ అంత ఇష్టం పాటను చిత్రీకరించి, లెన్త్ ఎక్కువ అయిందని తీసేస్తే మాత్రం.. రాబోయే రోజుల్లో మళ్లీ కలపాలని అభిమానులు కోరుతున్నారు. అలానే పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి బైక్ పై వెళ్తున్నట్లు ప్రచార చిత్రాల్లో కనిపించగా.. సినిమాలో మాత్రం ఆ సీన్ ని ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రంలో సంయుక్త మీనన్ - సముద్ర ఖని - రావు రమేష్ - మురళీ శర్మ - శత్రు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రవి కె చంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tags:    

Similar News