గుర్రం జాషువా కుమార్తె పాత్రలో రేణూ దేశాయ్..!

Update: 2022-09-19 06:12 GMT
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ''టైగర్ నాగేశ్వరావు'' ఒకటి. 70వ దశకంలో స్టూవర్ట్ పురంలో పేరుమోసిన.. రాబిన్ హుడ్ తరహాలో కొనియాడబడిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

'టైగర్ నాగేశ్వరావు' సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషించనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. 'బద్రి' మరియు 'జానీ' చిత్రాల్లో నటించిన రేణూ.. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తోంది. ఇందులో ఆమె ఏ పాత్రలో నటిస్తుందనే విషయంలో అనేక రూమర్స్ ఉన్నాయి.

అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఈ సినిమాలో తన గురించి స్పష్టత ఇచ్చింది. "హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రతో నన్ను నమ్మినందుకు వంశీకృష్ణ కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్న రేణూ.. ఆమె తన సన్నివేశాల స్క్రిప్ట్‌ ను షేర్ చేసింది.

డా. హేమలత లవణం.. ప్రముఖ రచయిత్రి, భారతీయ సంఘ సంస్కర్త. సాహితీ ప్రియులకు సుపరిచితులైన గుర్రం జాషువా కుమార్తె ఈమె. తన భర్త లవణంతో కలిసి అంటరానితనం - కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలానే జోగినీ దురాచార నిర్మూలన - నేరస్థుల సంస్కరణల కోసం అవిరళ కృషి చేశారు.

దళితులు మరియు గిరిజనుల అభ్యున్నతికి విశేష కృషి చేయడమే కాదు.. నేరస్థుల పునరావాసం - జోగినీ దురాచార నిర్మూలన కోసం ఆమె పాటుపడింది. ఆచార్య వినోబాభావేతో కలిసి లవణం దంపతులు బందిపోట్ల సంస్కరణ కోసం మధ్యప్రదేశ్ అడవుల్లో పాదయాత్ర చేశారు.

ఎంతో మంది దొంగలు తమ వృత్తిని వీడి సామాన్య జీవనం గడపడానికి హేమలత కృషి చేసింది. కుల, మత రహిత సమాజ నిర్మాణం కోసం 1,400 కిలో మీటర్ల మేర ఐక్యతా యాత్ర నిర్వహించింది. 1988లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం వెనుక ఈమె కృషి ఎంతో ఉంది.

2007లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హేమలత కు గౌరవ డాక్టరేట్‌ ను ప్రదానం చేసింది. పేదలు, అభాగ్యులు, దొంగలు, జోగినులు.. ఇలా అందరి జీవితాల్లోనూ వెలుగులునింపిన డాక్టర్ హేమలత పాత్రలో ఇప్పుడు రేణూ దేశాయ్ కనిపించనుందని తెలుస్తోంది. మరి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఆమెకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్ మరియు గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా.. మధే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్నారు. తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News