బాహుబలి టెక్నీషియన్‌ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే

Update: 2015-06-28 12:30 GMT
''బాహుబలికి ఓ రూపం ఇచ్చింది ఆయనే. నా ఊహా ప్రపంచానికి ప్రాణం పోసింది ఆయనే'' అంటూ వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు శ్రీనివాస్‌ మోహన్‌ను బాహుబలి ఆడియో ఫంక్షన్‌లో ఆకాశానికెత్తేశాడు రాజమౌళి. అంతకుముందు శంకర్‌ కూడా ఈ టెక్నీషియన్‌ గురించి గొప్పగా చెప్పాడు. బాహుబలి, రోబో, శివాజీ, అనగనగా ఓ ధీరుడు, అంజి, అరుంధతి, క్రిష్‌, అనేకుడు.. ఇలా ఎన్నో భారీ బడ్జెట్‌ సినిమాల్లో తన ప్రతిభతో అద్భుతాలు చేసి చూపించాడు శ్రీనివాస్‌ మోహన్‌. 'శివాజీ'లో రజినీకాంత్‌ అంత తెల్లగా కనిపించినా.. చిట్టిలో రజినీకాంత్‌ను రోబోలా సహజంగా చూపించినా.. ఇప్పుడు బాహుబలిలో ఎన్నో సాంకేతిక అద్భుతాలు చూపించినా.. ఆ ఘనతంతా శ్రీనివాస్‌దే.

ఐతే శ్రీనివాస్‌ నేపథ్యం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అతనేమీ ఉన్నత చదువులు చదవలేదు. విజయవాడలోన కృష్ణలంకలో పుట్టిన శ్రీనివాస్‌ పదో తరగతితోనే చదువు ఆపేశాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోగా.. అతను పదో తరగతిలో ఉండగా తల్లి కూడా గుండెజబ్బుతో చనిపోయింది. అక్కకు బంధువులబ్బాయితో పెళ్లవడంతో తాను ఏకాకిని అయిపోయానని.. ఆ సమయంలో ఎలక్ట్రీషియన్‌గా చేరి జీవనం మొదలుపెట్టానని చెప్పాడు శ్రీనివాస్‌. ఆ తర్వాత ఆడియో క్యాసెట్ల షాపులో చేరి.. పని చేసుకుంటూ కంప్యూటర్‌ కోర్సులు చేశానని.. ఆ తర్వాత యానిమేషన్‌ కూడా నేర్చుకున్నానని తెలిపాడు శ్రీనివాస్‌. అరుణాచలం సినిమాకు లోగో డిజైన్‌ చేయడంతో తనకు మంచి పేరొచ్చిందని.. అప్పటినుంచి సినిమాలకు పని చేయడం మొదలు పెట్టానని.. ఏఎం రత్నం ద్వారా శంకర్‌కు పరిచయం కావడంతో తనజీవితం మలుపు తిరిగిందని.. ముందు అయిష్టంగానే తనకు శంకర్‌ పనిచ్చాడని.. ఐతే మారో మారో పాటకు తాను చేసిన వర్క్‌ శంకర్‌కు తెగ నచ్చేసి ఆ తర్వాత తన సినిమాలన్నింట్లోనూ అవకాశమిచ్చాడని తెలిపాడు. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. బాహుబలి సినిమా మరో ఎత్తని.. ఈ సినిమాకు తనకు ఎన్నో గొప్ప అనుభూతులు మిగిల్చిందని శ్రీనివాస్‌ చెప్పాడు.

Tags:    

Similar News