తెలుగులో 'మానాడు' పరిస్థితి ఏంటి..?

Update: 2021-12-06 10:31 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్‌ సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఒక భాషలో సక్సెస్ అయిన చిత్రాలను మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. తెలుగులో హిట్ అయిన సినిమాల హక్కులను వేరే ఇండస్ట్రీల ఫిలిం మేకర్స్ పోటీపడి దక్కించుకుంటే.. మనవాళ్ళు ఇతర భాషల కథలను అరువు తెచ్చుకుంటుంటారు.

కాకపోతే ఇప్పుడు చిరంజీవి - పవన్ కళ్యాణ్ - వెంకటేష్ వంటి స్టార్ హీరోలు రీమేక్ సినిమాలు చేస్తుండటంతో వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుతున్నారు.

గత రెండేళ్లలో అనేక తమిళ మలయాళ హిందీ సినిమాలు తెలుగులోకి రీమేక్ చేయబడ్డాయి. స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తుండటంతో మన నిర్మాతలు పోటీపడి రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన ''మనాడు'' సినిమా కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించిన లేటెస్ట్ మూవీ ''మానాడు''. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైమ్ లూప్ వంటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే ఇప్పుడు ఈ మూవీ హక్కుల కోసం శ్రేష్ట్ మూవీస్ - సురేష్ ప్రొడక్షన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. నిజానికి 'మానాడు' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేసారు.

''ది లూప్'' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ - బన్నీ వాసు ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సన్నాహాలు జరిగాయి.

'ది లూప్' ప్రచార చిత్రాలు - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. హీరో శింబు కూడా తెలుగు మీద దృష్టి పెట్టి ఇక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏమైందో ఏమో చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర భాషల్లో రిలీజ్ చేయకపోతున్నామని నిర్మాతలు తెలిపారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ 'మనాడు' రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే హీరో శింబు మాత్రం ఈసారి ఎలాగైనా సరే టాలీవుడ్ లో సత్తా చాటాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ముందుగా అనుకున్న ప్రకారమే తెలుగులో నేరుగా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. మరి చివరికి ఈ టైం లూప్ పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్ ఏ విధంగా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.

కాగా, ''మనాడు'' సినిమాలో శింబు సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఎస్.జె సూర్య - భారతీరాజా - ఎస్.ఏ.చంద్రశేఖర్ - ప్రేమ్ జీ - కరుణాకరన్ - మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉమేష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

What is the situation of 'Manadu' in Telugu 
Tags:    

Similar News