ప‌ర‌మ చెత్త ట్రోలింగ్ ఎదుర్కొన్నాను: జాన్వీ

భ‌విష్య‌త్‌లో చ‌ర‌ణ్ తో క‌లిసి జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రిలో న‌టించే వీలుంది.

Update: 2024-06-14 07:28 GMT

మృగ‌న‌యాన‌ల‌తో వాలు చూపుల‌తో గుండె గిల్లుతున్న కొంటె లేడీ జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ దేవ‌ర‌తో తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగు పెడుతున్న ఈ న‌వ‌య‌వ్వ‌ని, బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించేస్తోంది. భ‌విష్య‌త్‌లో చ‌ర‌ణ్ తో క‌లిసి జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రిలో న‌టించే వీలుంది.

ఇదిలా ఉంటే జాన్వీ క‌పూర్ న‌టించిన `మిస్టర్ & మిసెస్ మహి` ఇటీవ‌లే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇందులో కూడా రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే జాన్వీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఈ చిత్రం గురించి జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ డ్రామాలో న‌టించినందుకు పెద్దగా ట్రోల్ చేసార‌ని వెల్లడించింది. ఒక వైద్యుడు సోష‌ల్ మీడియా ఖాతాలో క్రికెట్ ఆధారిత సినిమా చేయడానికి చెత్త అభ్యర్థి అని త‌న‌ను ట్రోల్ చేసిన‌ట్టు జాన్వీ వెల్ల‌డించింది.

జాన్వీ కపూర్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి ఒక సంవత్సరం పాటు క్రికెట్ ఆడ‌టం నేర్చుకుంది. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు త‌న‌ భుజాలకు కూడా గాయమైంది. క్రికెట్ ప్లేయ‌ర్ గా త‌న న‌ట‌ ప్రదర్శనకు నిజానికి చాలా మంది నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి. క్రిటిక్స్ సైతం ప్ర‌శంసించారు. అయితే స‌ద‌రు వైద్యుడి అభిప్రాయం వేరుగా ఉంది. తాను ఇంత ఇచ్చినా ఈ ట్రోల్స్ ఎప్పటికీ ఆగవని, కొన్నిసార్లు అవి పెద్దగా బాధించాయని, అయితే జీవితంలో తాను కోరుకున్నది చేస్తూనే ఉంటానని జాన్వీ చెప్పింది. ధ‌డ‌క్ చిత్రంతో క‌థానాయిక‌గా కెరీర్ ప్రారంభించిన జాన్వీ క‌పూర్ ప‌లు చిత్రాల్లో అవార్డ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇప్పుడిలా స‌డెన్ గా ట్రోలింగ్ ని ఎదుర్కొన్నానని తెలిపింది.

Tags:    

Similar News