ఇద్దరు గజినీల కోసం అలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారా?

దీంతో ఒకే పాత్ర పోషించిన ఇద్దరు హీరోలు కలవడం ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-10-23 05:35 GMT

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 'గజిని' సీక్వెల్ వార్తల్లోకి వచ్చింది. 'కంగువ' ప్రమోషన్స్ లో భాగంగా హీరో సూర్య ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''గజిని 2'' గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో గజినీకి కొనసాగింపు ఉంటుందని, తనను అమీర్ ఖాన్ ను ఒకేసారి బిగ్ స్క్రీన్ మీదే చూసే అవకాశం ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ఒకే పాత్ర పోషించిన ఇద్దరు హీరోలు కలవడం ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, అసిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ''గజిని''. 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో సూర్యకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే చిత్రాన్ని అదే పేరుతో 2008లో హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్, అసిన్, జియా ఖాన్ లతో రీమేక్ చేశారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

భారతీయ చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకున్న తరువాత, ''గజిని'' కి కొనసాగింపుగా మరో మూవీ చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు భావించారు. కానీ ఆ దిశగా దర్శక హీరోలు ఆలోచించలేదు. కానీ ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు 'గజిని 2' విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీనికి ఎవరైనా స్క్రిప్ట్ రెడీ చేస్తే నటించడానికి తాను సిద్ధమే అని పేర్కొన్నారు. లేటెస్టుగా సూర్య సైతం 'గజినీ 2' గురించి హింట్ ఇచ్చారు.

కాకపోతే సూర్య చెప్పినట్లు ఇద్దరు గజినీలు ఎలా స్క్రీన్ షేర్ చేసుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తమిళ్, హిందీ వెర్షన్స్ రెండు గజినీలు ఒకే కథతో తెరకెక్కాయి. హిందీలో మాత్రం విలన్ పాత్రలో కాస్త మార్పులు చేశారు తప్పితే, మిగతాదంతా సేమ్. అలాంటిది ఇద్దరు గజినీలు ఒకే సినిమాలో ఎలా కనిపిస్తారనే ప్రశ్న వస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

'గజినీ 2' చిత్రాన్ని తమిళంలో సూర్య, హిందీలో ఆమిర్‌ ఖాన్‌ తో రూపొందించే అవకాశం ఉందని.. ఇద్దరు హీరోలు ఒకరి చిత్రంలో మరొకరు అతిథి పాత్ర పోషించే ఛాన్స్‌ ఉందంటూ కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మతిమరుపు గజినీ కాన్సెప్ట్ తో మరో కొత్త కథతో ఆమీర్, సూర్యలతో మల్టీస్టారర్ చేసే అవకాశం కూడా ఉందంటూ మరో టాక్ వినిపిస్తోంది.

ఆమీర్ ఖాన్, సూర్య 'గజిని 2' పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ, దర్శకుడు మురగదాస్ దీనిపై ఇప్పటికైతే ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ తో 'సికందర్' సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది వచ్చే ఏడాది ఈద్ స్పెషల్ గా రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో మురుగదాస్ గజిని సీక్వెల్ పై మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే దర్శకుడు ఈ క్రేజీ సీక్వెల్ కు స్క్రిప్టు రాస్తే మాత్రం, బాక్సాఫీసు దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావించవచ్చు.

Tags:    

Similar News