వి.వి. వినాయక్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. టీమ్ క్లారిటీ!
టాలీవుడ్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ వీవీ వినాయక్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
టాలీవుడ్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ వీవీ వినాయక్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జెట్ స్పీడ్ లో మాస్ సినిమాలతో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. ‘ఆది’తో మొదలై ‘దిల్’, ‘ఠాగూర్’, ‘లక్ష్మీ’, ‘అదుర్స్’, ‘నాయక్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 కూడా ఆయన దర్శకత్వంలో వచ్చిన విషయం తెలిసిందే.
అయితే గత కొన్నేళ్లుగా వినాయక్ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని, హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. గత కొన్ని రోజులుగా వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స జరగడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి.
అయితే, ఈ వార్తలపై వీవీ వినాయక్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. వీవీ వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీమ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీమ్ ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిరాధారంగా నమ్మకూడదని కోరింది.
ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చింది. వినాయక్ చివరిగా హిందీలో ఛత్రపతి రీమేక్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వినాయక్ పెద్దగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. బాలకృష్ణతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా, ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఆయన కెరీర్లో హిట్స్, ఫ్లాప్స్ చాలా చూశారు. 2014 తర్వాత వరుస డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం బాగా హెల్ప్ చేసే దర్శకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్కు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం అందించేందుకు ముందుకు వచ్చారు.
దర్శకుడిగా భారీ విజయాలు అందుకున్నప్పటికీ, నటుడిగా మాత్రం వినాయక్కు ఆ సక్సెస్ రాలేదు. గతంలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్లో శీనయ్య అనే సినిమా హీరోగా స్టార్ట్ చేశాడు. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిపిన తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ తర్వాత ఓటీటీ మూవీస్లో నటిస్తారని టాక్ వచ్చింది. కానీ ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకోలేదు. మొత్తంగా వినాయక్ మళ్లీ హిట్ డైరెక్టర్గా రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది చూడాలి.