హాట్ టాపిక్... నేడు పిన్నెల్లి సోదరులు మాచర్లకు వస్తే...?

ఏపీలో పోలింగ్ ముగిసిన చాలా రోజుల తర్వాత మాచర్లలో ఈవీఎం ధ్వంసం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే

Update: 2024-05-24 04:32 GMT

ఏపీలో పోలింగ్ ముగిసిన చాలా రోజుల తర్వాత మాచర్లలో ఈవీఎం ధ్వంసం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్ లో దర్శనమిచ్చిన ఆ వెబ్ క్యాస్టింగ్ వీడీయోపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు సుమారు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి.

ఈ సమయంలో అనూహ్యంగా పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిపై జూన్ 5 ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 6కి వాయిదా వేసింది.

ఆ సంగతి అలా ఉంటే... ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మాచర్లకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈరోజు ఆయన తన తమ్ముడు వెంకట్రామిరెడ్డితో కలిసి మాచర్లకు వచ్చే అవకాశం ఉందని అనుచరుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఈ రోజు మాచర్లలో ఏమి జరగబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... సుమారు మూడు రోజులుగా ఏపీ పోలీసులు గాలిస్తున్నప్పటికీ అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి.. ఈ రోజు మాచర్లకు రానున్నారనే ఊహాగాణాల నేపథ్యంలో స్థానికంగా అనుచరుల సందడి నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మాచర్లలో 144 సెక్షన్ నడుస్తుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ బయటకు వస్తారా..? మీడియాతో మాట్లాడతారా..? ఇంతకీ.. పిన్నెల్లి హైదరాబాద్‌ లో ఉన్నారా..? ఏపీలో ఉన్నారా..? ఒకవేళ హైదరాబాద్ లోనే ఉంటే అక్కడే ఉండి మీడియాతో మాట్లాడతారా..? లేక, మాచర్లలోనే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా... పిన్నెల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై తీవ్ర ఉత్కంట నెలకొంది!

Tags:    

Similar News