ఎర్ర‌బెల్లికి ఎర్త్ పెట్ట‌డానికి రేవంత్ కు ప్లాన్ దొరికిందిగా?

ప్ర‌స్తుత బీఆర్ఎస్ నేత ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు విష‌యంలో తాజాగా ఈ సీన్ తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని అంటున్నారు.

Update: 2024-10-26 10:30 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌గ‌తో ర‌గిలిపోతూ... అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నారా లేదంటే... అవ‌కాశాలే త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఇరికించేందుకు రేవంత్ ముందుకు వచ్చేస్తున్నాయా... అనేది తెలియ‌దు కానీ...జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం అంతిమ ఫ‌లితం అదే అన్న‌ట్లుగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి `బ‌హిరంగ అప్ర‌క‌టిత ప్ర‌త్య‌ర్థి` జాబితాలో టాప్ లో ఉండే మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీఆర్ఎస్ నేత ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు విష‌యంలో తాజాగా ఈ సీన్ తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని అంటున్నారు.

టీడీపీలో కొన‌సాగుతున్న స‌మ‌యంలో తెలంగాణ టీడీపీ ఫోరం క‌న్వీన‌ర్‌గా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉండ‌గా... అందులోని ఓ నేత‌గా రేవంత్ రెడ్డి ఉండేవారు. రేవంత్ జీవితంలో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయిన `ఓటుకు నోటు` కేసులో ఆయ‌న రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవ‌డానికి... గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇచ్చిన స‌మాచార‌మే కార‌ణ‌మ‌ని... పార్టీలోని ప‌రిణామాల‌ను కేసీఆర్ కు తెలియ‌జేసి త‌న జీవితాన్ని అంధ‌కారంలోకి నెట్టాడ‌ని రేవంత్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానించిన‌ట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అలా, రేవంత్ రెడ్డికి బ‌హిరంగ‌ అప్ర‌క‌టిత ప్ర‌త్య‌ర్థుల‌ జాబితాలో ఎర్ర‌బెల్లి టాప్ లో ఉంటారు. అలాంటి ఎర్ర‌బెల్లి విష‌యంలో తాజాగా రేవంత్ కు ఓ సూప‌ర్ చాన్స్ దొరికింద‌ని టాక్ న‌డుస్తోంది.

తెలంగాణ‌లో తాజాగా ఎన్‌ఫోర్స‌మెంట్ డైరెక్ట‌రేట్ చేస్తున్న విచార‌ణ సంచ‌ల‌నంగా మారుతోంది. ఐఏఎస్ అధికారి అమోయ్‌‌ కుమార్‌‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూదాన్ భూముల అక్రమ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉండ‌గా,

అమోయ్‌‌ కుమార్ ను ఈడీ విచార‌ణ చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములలో రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు, ఇందులో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం కూడా జ‌రిగింది. మ‌రోవైపు ఈడీ విచార‌ణ సైతం జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది.

మాజీ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుతో అమోయ్ కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎర్ర‌బెల్లి మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వీరి మ‌ధ్య దోస్తీ ఏర్ప‌డింద‌ని పేర్కొంటున్నారు. క‌ట్ చేస్తే తాజాగా ఈ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్ల‌వ‌చ్చంటున్నారు. ప్ర‌భుత్వ భూముల బ‌ద‌లాయింపుపై రంగారెడ్డి కోర్టులో పిటిష‌న్ దాఖ‌ల‌వ‌డం, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపడం, ఈడీ అమోయ్ కుమార్ పై దూకుడుగా ముందుకు వెళుతుండ‌టంతో... రేవంత్ సైతం ఎర్ర‌బెల్లికి అమోయ్ కుమార్ తో లింక్‌లు ఉన్న‌ట్లు క‌న్ఫం అయితే క‌నుక పాత ప‌గ‌లు తీర్చుకోవ‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News