తండ్రి తీరుతో పెళ్లి కావట్లేదని చంపేశాడు

బంధాలు.. అనుబంధాలు మాటలుగా మాత్రమే మారాయా? అన్న సందేహం కొన్ని దారుణ ఘటనల గురించి విన్నప్పుడు కలుగుతుంది.

Update: 2024-10-22 08:30 GMT

బంధాలు.. అనుబంధాలు మాటలుగా మాత్రమే మారాయా? అన్న సందేహం కొన్ని దారుణ ఘటనల గురించి విన్నప్పుడు కలుగుతుంది. తాజాగా అలాంటి పరిస్థితే ఈ ఉదంతం గురించి విన్నప్పుడు కలుగుతుంది. కన్నతండ్రి తీరుతో తనకు పెళ్లి కావట్లేదన్న కోపంతో ఒక కొడుకు చేసిన దుర్మార్గమిది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో సోమవారం తెల్లవారుజామున వెలుగు చూసిన ఈ ఉదంతంలోకి వెళితే.. కొడుకు దుర్మార్గం మరీ ఇంతనా? అన్న భావన కలుగక మానదు.

తండ్రి తీరుతో పాటు.. అతడికున్న ఆస్తి మీద కన్నేసిన కొడుకు ఆయన్నుమట్టుబెట్టేందుకు వెనుకాడలేదు. అయితే.. అంత్యక్రియల సమయంలో అతడి పన్నాగం బయటపడింది. అప్పటివరకు సహజ మరణంగా భావించినప్పటికి.. మృతుడి సోదరి.. తన అనన మెడకు ఉన్నగాయాన్ని చూసి సందేహానికి గురైంది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. అనంతగిరికి చెందిన 54 ఏళ్ల గౌరు అమ్రతం పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. ఆయనకు ఇద్దరు కొడుకులు (మహిపాల్, మనోజ్) ఉన్నారు. ఇంట్లో గొడవల కారణంగా ఆయన భార్య పిల్లలతో పాటు నుంచి వెళ్లిపోయింది.

కొడుకులు ఇద్దరు బతుకుదెరువు కోసంకొంతకాలం క్రితం దుబాయ్ వెళ్లారు. పెద్ద కొడుకు మహిపాల్ తాను పని చేస్తున్న దగ్గర తన తండ్రి చనిపోయినట్లుగా అబద్ధాలు చెప్పేవాడు. పది రోజుల క్రితం అనంతగిరికి వచ్చిన అతను తండ్రి వద్దే ఉండసాగాడు. ఆదివారం ఇద్దరూ ఇంట్లోనే తాగారు. తాగిన మత్తులో ఉన్న తండ్రి మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. సోమవారం ఉదయం ఏమీ తెలియనట్లుగా నిద్ర లేచి.. తండ్రి ఉలుకుపలుకు లేకుండా ఉన్నాడంటూ ఒక ఆర్ ఎంపీని ఇంటికి తీసుకొచ్చాడు.

అతను పరీక్షించి చనిపోయినట్లుగా చెప్పారు. దీంతో.. తన తండ్రి అనారోగ్యంతో చనిపోయినట్లుగా అందరికి చెప్పసాగాడు. గ్రామస్థులను నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడ మీద ఉన్న గాయాల్ని చూసిన మృతుడి సోదరి సందేహానికి గురైంది. ఆమె తన బంధువులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చారు.

దీంతో అసలు దుర్మార్గాన్ని బయటకు కక్కేశాడు. తన తల్లితో వేరుపడటం.. నిత్యం మద్యం తాగుతున్న కారణంగా తనకు పెళ్లి కావట్లేదని.. అందుకే తన తండ్రి మీద కక్ష పెంచుకున్నట్లుగా చెప్పాడు. అదే సమయంలో తన తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు.. ప్లాటు అమ్మేసి తల్లి పేరుతో అనంతగిరిలో ఇల్లు కట్టాలన్న ఉద్దేశంతోనే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News