26/11 ముంబై మారణకాండ..నేటికి 14 ఏళ్లు..

Update: 2022-11-26 11:30 GMT
26/11 దాడులు జరిగి నేటి 14 ఏళ్లు నిండాయి. 14 ఏళ్ల తర్వాత కూడా ముంబై ఉగ్రదాడుల భయంకరమైన జ్ఞాపకాలు ఇప్పటికీ బాధితులను వెంటాడుతున్నాయి. భారతీయుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన దాడిలో దాదాపు 166 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఇది మొత్తం దేశాన్ని కదిలించిన అత్యంత విధ్వంసక ఉగ్రవాద చర్యలలో ఒకటి. ఈ ఘటన జరిగి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఘోర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రజలు స్మరించుకుంటూ దేశం, ప్రపంచం నలుమూలల నుండి నివాళులర్పించారు.

2008 నవంబర్ 26 తేదీ అనగానే ప్రతీ భారతీయుని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆరోజు జరిగిన మారణ హోం ఇండియా ఇప్పటికీ మరిచిపోలేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు సృష్టించిన ఈ దాడి ఇప్పటికి మానని గాయంగానే మగిలింది. ప్రపంచ ఉగ్రదాడుల్లోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్న ఇలాంటి దాడి మరోసారి జరగనివ్వబోమని భారత ఆర్మీ చెబుతోంది. ప్రస్తుతం అత్యంత ఆధునికమైన ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయని, ఎలాంటి ముష్కరులు తెగబడ్డా తిప్పి కొడతామని అంటోంది.

14 ఏళ్ల కిందట పాకిస్తాన్ లోని కరాచీ రేవు నుంచి  అరేబియా సముద్రం మీదుగా ముష్కరులు మంబైలోకి చొరబడ్డారు. అజ్మల్ సహా 10 మంది ఉగ్రవాదులు తాజ్, ఒబెరాయ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర నాలుగు రోజుల పాటు మారణకాండ సృష్టించారు. ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఇక రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణ కాండకు పాల్పడిన పది మంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చారు. ఉగ్రవాది కసబ్ ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు.

ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఉగ్రవాద నిరోధక దళం చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తుకారం ఓంబుల్ అమరులయ్యారు. ఈ మారణహోమం జరిగి 13 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దానిని మరిచిపోలేకపోతున్నారు. ఇక బాధిత కుటుంబాల్లో మాత్రం అప్పటి సంఘటనలు కళ్లముందు కదలాడుతున్నట్లే ఉన్నాయి. ఈ సందర్భంగా నాటి దాడుల్లో వీరమరణం పొందిన వారికి భద్రతా అధికారులు, పోలీసులు ఘనంగా నివాళులర్పించారు.

అయితే ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండ్ జకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం 1997లోని వివిధ సెక్షన్ల కింద ఈ శిక్షను ఖరారు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై ఆయనను ముందుగా అరెస్టు చేశారు. ఇక ముంబై దాడి తరువాత లఖ్వీని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

నేటికి ఈ సంఘటన జరిగి 14 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా పోలీసులు, అధికారలు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ముంబై పోలీసుల్లోనూ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్, ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చారు. ఎప్పడు ఎలాంటి సంఘటన జరిగినా ఏమాత్రం జడవకుండా వారిదగ్గర అయుధాలను ఉంచారు. దీంతో మునుపటి కంటే ఇప్పుడు ఉగ్రవాదులను తిప్పకొట్టడానికి అవసరమైన సదుపాయాలున్నాయని కొందరు పోలీసులు అంటున్నారు.

పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున, 10 మంది లష్కరే తోయిబా  ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి సముద్ర మార్గం గుండా ముంబైలోకి చొరబడి, నగరం అంతటా సమన్వయంతో కాల్పులు , బాంబు దాడులకు పాల్పడ్డారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్  రైల్వే స్టేషన్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్ బిజినెస్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, లియోపోల్డ్ కేఫ్, తాజ్ హోటల్ అండ్ టవర్,  ఒబెరాయ్-ట్రైడెంట్ హోటల్ లో ఉగ్రవాదానికి చాలా మంది బలయ్యాయి. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమవ్వగా, ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకుని, 2012లో పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో మరణశిక్ష విధించారు. పద్నాలుగేళ్ల తర్వాత దేశం తమ ప్రాణాలను కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తోంది.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా 26/11 బాధితులకు నివాళులర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారులను గుర్తు చేసుకున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ, "లేదు, నేను ఎప్పటికీ మరచిపోలేను. కానీ ఇది నాకు గుర్తుండే భయానక లేదా భీభత్సం కాదు. ఈ హీరోలను నేను గుర్తుంచుకుంటాను. నా హృదయంలో మరియు తలలో ఎప్పటికీ నిలిచిపోతారు. "


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News