విశాఖ రాజ‌ధాని.. ముహూర్తం ఇదేనా?

Update: 2023-02-17 13:01 GMT
ఏపీలో మూడు  రాజ‌ధానుల పాట పాడుతున్న వైసీపీ ప్ర‌భుత్వం.. కోర్టు కేసుల‌ను, ఆదేశాల‌ను.. తీర్పుల‌ను ఏమాత్రం ప‌ట్టించు కుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు. రాజ‌ధాని విష‌యం కోర్టులో ఉండ‌గానే.. సీఎం జ‌గ‌నే స్వ‌యంగా ఢిల్లీలో త్వ‌ర‌లోనే విశాఖ రాజ‌ధాని అవుతుంద‌ని.. తాను కూడా అక్క‌డ‌కు వెళ్లిపోతాన‌ని ప్ర‌క‌టించి.. సంచ‌ల‌నం రేపారు. ఇక‌, ఇప్పుడు దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖ‌రారు చేసుకున్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని చూచాయ‌గా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వెల్ల‌డించారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిందే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స అన్నారు. ఇప్పటికీ తమ విధానం వికేంద్రీకరణే అని అన్నారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

రాష్ట్రంలో 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అమరావతి శాసనరాజధాని, విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అని మంత్రి బొత్స  స్పష్టం చేశారు.

ఇదీ ప్రభుత్వ విధానమని, ప్రభుత్వ నిర్ణయమని, ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి చెప్పారు.

అంతేకాదు.. ఉగాది నుంచే విశాఖ నుంచి పాలన చేయాలని సీఎం జగన్ పై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. తమ వినతికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమి పాలైందని చెప్పారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చిందన్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రకటించారని చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి ఉగాది నాటికి విశాఖ‌కు రాజ‌ధానిని త‌ర‌లించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News