అమ్మ‌లో మార్పెందుకు వ‌చ్చింది?

Update: 2016-08-02 16:10 GMT
దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విపక్షాల్ని నిర్వీర్యం చేసి వాటి మనుగడనే నిర్మూలించాలన్న ల‌క్ష్యంతో అధికారపక్షాలు వ్యవహరిస్తున్న తరుణంలో తమిళ ముఖ్యమంత్రి జయలలిత తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య పక్షాలన్నింటికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ చర్యను ప‌లువురికి ఆద‌ర్శంగా మారింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతగా తమిళ ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సిన పనేంటంటే అమ్మ ఊహించ‌ని కోణంలో తీసుకున్న నిర్ణ‌య‌మే. ప‌గ‌కు మారుపేరు అయిన జ‌య ఇపుడు ప్ర‌తిప‌క్ష పార్టీకి విలువ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అధికార ప్రతిపక్షాల పరస్పర విద్వేషాలకు - దాడులకు తమిళనాడు ప్రత్యక్ష ఉదాహ‌రణ‌ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ రాష్ట్రంలో అధికార‌-ప్ర‌తిప‌క్ష నేత‌లు కనీసం ఒకర్నొకరు మొహాలు చూసుకునేందుకు కూడా ఇష్టపడరు. పైగా రాజకీయ కక్షల్ని దాటి తమిళ పార్టీలు వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటాయి. అధికారంలోకొచ్చిందే తడవుగా విపక్షనేతలపై పోలీసులు - గూండాల్తో కూడా దాడులు చేయిస్తాయి. వార్ని బట్టలూడదీయించి పరుగులు పెట్టిస్తాయి. ఆఖరికి జయలలిత - కరుణానిధిలు అసెంబ్లీలో ఎదురుపడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జయలలిత అసెంబ్లి వైపు అడుగు పెట్టేవారుకాదు. అలాగే కరుణానిధి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జయలలిత మొహం చూసేందుకు ఇష్టపడేవారు కాదు. కరుణానిధికి అధికారం పోగానే ఆయనింటిపైకి జయలలిత పోలీసుల్నిపంపించారు. ఆయన్ను బట్టలూడదీస్తూ జీపులోకెక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇక కరుణ అంతకుమించి వ్యవహరించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే బయలలిత బట్టలు లాగించేందుకు ప్రయత్నించారు.

అలాంటి తమిళనాడులో ఇప్పుడు పరిస్థితులు మారాయి. జయలలిత ఈ సారి ముఖ్యమంత్రి కాగానే విపక్షం పట్ల తన ధోరణిని సడలించుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ సభకొచ్చిన ప్రతిపక్షనేత స్టాలిన్‌ కు తగిన మర్యాద అందలేదంటూ పత్రికలు వెల్లడించడంతో స్వయంగా ఆమె ఫోన్‌ చేసి క్షమాపణ అడిగారు. ఇది తనకు తెలీకుండా జరిగిన వ్యవహారంగా చెప్తూ...కావాలని అవమానించలేదన్నారు. అధికారులు తన దృష్టికి తేకుండానే స్టాలిన్‌ కు సభలో నాలుగో వరుసలో సీటు కేటాయించారన్నారు. అప్పట్నుంచి అధికార - విపక్షాల మధ్య పెడధోరణులు కాస్త తగ్గాయి. కాగా ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ఏఐడీఎంకే ఎంపీ శ‌శిక‌ళ‌ డీఎంకే పార్ల‌మెంటు స‌భ్యుడిపై చేయిచేసుకున్న సంఘటనను జ‌యలలిత సీరియస్‌ గా తీసుకున్నారు. ఇలాంటివాటిని తాను సహించేదిలేదంటూ హెచ్చరించారు.త‌మ‌ ఎంపీని పదవికి రాజీనామా చేయమంటూ ఆదేశించారు. ఈ చర్య విపక్షాలకు జయలలిత ఇస్తున్న గౌరవానికి అద్దం పడుతోంద‌ని, ఆమెలో వచ్చిన మార్పుకు సంకేతంగా నిల్చిందని అంటున్నారు.

ఓ వైపు దేశవ్యాప్తంగా విపక్ష నేతలపై కేసులు పెడుతున్నారు. భౌతికంగా హతమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడే కాదు.. ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా ప్రకటించుకునే అమెరికాలోనూ పరిస్థితి ఇంతకంటే దిగజారింది. తాజా ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ కార్యకర్తలు శృతిమించి వ్యవహరించి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ భార్య ఒకప్పుడు పేరెన్నికగన్న మోడల్‌ కావడంతో అప్పట్లో ప్రచురితమైన ఆమె ఫోటోల్ని అసభ్యకర రీతిలో తిరిగి ప్రజల ముందుకు తెస్తున్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ తద్వారా ట్రంప్‌ పై పైచేయి సాధించేందుకు డెమోక్రాట్‌ లు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో జయలలిత వ్యవహారశైలి నిజంగా ఆశ్చర్యమే. ప్రజాస్వామ్యంలో అధికార - విపక్షాలది సమానపాత్ర. ఒకరికొకరు గౌరవించుకున్న నేపధ్యంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుంది. రాజకీయ పునాదులపైనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జయలలిత తీరు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలకు ఆదర్శనీయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News