కేసీఆర్‌ కు కోదండ‌రాం ఎవ‌రో తెలియ‌ద‌ట‌!

Update: 2017-09-29 13:04 GMT
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించ‌డంలో... ఆ రాష్ట్ర ఏర్పాటే ల‌క్ష్యంగా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ ఎస్‌)తో పాటు తెలంగాణ నేల‌కు చెందిన ప‌లు రాజ‌కీయ పార్టీలు - ప్ర‌జా సంఘాలు కూడా కీల‌క భూమిక పోషించాయ‌నే చెప్పాలి. టీఆర్ ఎస్ ఒక్క దానితోనే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాలేద‌న్న విష‌యం కూడా ఏ ఒక్క‌రూ కాద‌న‌లేనిదే. సుదీర్ఘ కాలంగా ఉద్య‌మాన్ని స‌జీవంగా ఉంచ‌డంలో టీఆర్ ఎస్ త‌న‌దైన కీల‌క భూమిక‌ను పోషిస్తే... అప్ప‌టిదాకా విద్యార్థుల‌కు పాఠాలు చెప్పుకుంటున్న ఉస్మానియా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ కోదండరాం ఎంట్రీతో ఉద్య‌మ స్వ‌రూప‌మే మారిపోయింద‌ని చెప్పాలి. కోదండ‌రాం వెంట విద్యార్థి - ఉపాధ్యాయ సంఘాల‌తో పాటు ప్ర‌జా సంఘాలు కూడా క‌లిసి రావ‌డంతో ఆయ‌న‌కు ఎంతైనా ప్రాధాన్యం ఇవ్వాల్సిందేన‌న్న భావ‌న‌తో టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఆయ‌న‌కు స‌ముచిత స్థానం ఇవ్వ‌డంతో పాటు కోదండ‌రాం అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన తెలంగాణ రాజ‌కీయ ఐక్య కార్యాచ‌ర‌ణ‌లో తాము కూడా ఓ భాగ‌మ‌న్న చందంగా వ్య‌వ‌హ‌రించిన తీరు ఏ ఒక్క‌రూ మ‌రిచిపోలేనిదే.

అన్ని వ‌ర్గాలు క‌లిసి ఉద్య‌మాన్ని హోరెత్తించిన క్ర‌మంలో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాగా... ఉద్యమానికి నేతృత్వం వ‌హించిన రాజ‌కీయ పార్టీగా టీఆర్ ఎస్‌ కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. కేసీఆర్‌ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అప్ప‌టిదాకా కేసీఆర్‌ - కోదండ‌రాంల మ‌ధ్య సంబంధాలు బాగానే ఉన్నా... ఒక్క‌సారిగా ఆ సంబంధాలు బీట‌లు వారాయి. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌శ్నించిన కోదండ‌రాం... కేసీఆర్ అండ్ కోకు నిజంగానే శత్రువుగా క‌నిపించారు. ఇంకేముంది... కోదండ‌రాంను ప‌క్క‌న‌పెట్టేస్తూ వ‌చ్చిన టీఆర్ ఎస్‌... అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జా సంఘాల‌తో పాటు కోదండ‌రాంపై నిప్పులు చెరుగుతూనే ఉంది. ఇప్ప‌టిదాకా టీఆర్ ఎస్ నేత‌ల నుంచి కోదండ‌రాంకు వ్య‌తిరేకంగా వినిపించిన గ‌ళాల‌న్నింటి కంటే కూడా ఇప్పుడు కేసీఆర్ నోట వినిపించిందే ఘాటు వ్యాఖ్య‌గా ప‌రిగ‌ణించాలేమో. అయినా కోదండ‌రాంను కేసీఆర్ ఏమ‌న్నార‌నేగా మీ ప్ర‌శ్న‌? అక్క‌డికే వ‌స్తున్నాం. ఉద్యమంలో త‌న‌తో పాటు న‌డిచిన - త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన కోదండ‌రాం ఎవ‌రో కూడా తెలియ‌ద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఆ క‌థాక‌మామీషు ఏమిటో చూద్దాం ప‌దంది. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్మికులకు - వారి కుటుంబాలకు పలు ప్రయోజనాలు ప్రకటించిన కేసీఆర్‌.. త‌న‌ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తోన్న జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై ఆయ‌న‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ప్రగతి భవన్‌ లో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కోదండ‌రాంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ‘‘ఓట్ల కోసం మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కోదండరాం.. ఎవరాయన? తాడు - బొంగరం లేనివాళ్లు ఏదేదో మాట్లాడుతారు. మేం చెప్పింది చేస్తాం. ఉద్యోగాల కోసం కొత్త భూగర్భగనులు ప్రారంభిస్తాం’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 1980 నుంచి సింగరేణిలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఇంతకాలం గెలిచినవాళ్లు పనులు చేయలేదని, టీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వచ్చాకే వేల మందికి ఉద్యోగాలిచ్చామని కేసీఆర్‌ గుర్తుచేశారు.
Tags:    

Similar News