అమ్మను హత్య చేశారన్న మాజీ స్పీకర్

Update: 2017-02-07 06:59 GMT
చిన్నమ్మ టైం ఏమాత్రం బాగోనట్లుగా ఉంది. సీఎం కుర్చీలో కూర్చోవటానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ మీద దెబ్బ పడుతున్న వేళ.. ఇంతకాలం తన కనుసన్నల్లో ఉన్న అన్నాడీఎంకే నేతల నుంచి తొలిధిక్కార స్వరం ఒకటి బయటకు వచ్చింది. చిన్నమ్మ మీద తీవ్ర ఆరోపణలు చేసేలా.. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత.. మాజీ స్పీకర్ వీర పాండ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ జయలలితది ముమ్మాటికి హత్యగా అభివర్ణించిన ఆయన.. పోయెస్ గార్డెన్ లో అమ్మతో ఘర్షణ పడ్డారని.. ఆమెను కిందకు తోసేసినట్లుగా ఆయన ఆరోపించారు.

పోయెస్ గార్డెన్ లో అమ్మను తోసేయటంతో ఆమె తీవ్ర గాయాలకు గురయ్యారని.. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారన్నారు. జయలలితకు వైద్యం అందించిన వైద్యులు అన్ని వివరాలు అందించటం లేదన్న ఆయన.. అమ్మకు వైద్యంజరుగుతున్న వేళ.. పార్టీ సీనియర్ నేతల్ని సైతం చిన్నమ్మ అనుమతించలేదన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అర్హత చిన్నమ్మకు లేదని చెప్పిన ఆయన.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీరుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జయలలిత మృతిపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్న డిమాండ్ చేసిన పాండయ్యన్.. చిన్నమ్మపైన నిప్పులు చెరిగారు. 1.5కోట్ల మంది క్యాడర్ ఉన్న అన్నాడీఎంకే పార్టీలో చీలిక వచ్చే అవకాశమే లేదన్న ఆయన చిన్నమ్మపై విరుచుకుపడిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పాండ్యన్ బాటలో మరికొందరు అన్నాడీఎంకే నేతలు గళం విప్పుతారన్న అంచనాలు నిజమైతే.. అమ్మపార్టీలో పెను సంక్షోభంలోకి కూరుకుపోయినట్లేనన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News