బిగ్ షాకింగ్: మ‌మ‌త‌కు బీజేపీ సెగ‌.. 38 మంది ఎమ్మెల్యేల‌కు వ‌ల‌!!

Update: 2022-07-28 04:01 GMT
ఇది నిజంగా బిగ్ షాకింగ్ న్యూస్‌. బెంగాల్ లేడీ టైగ‌ర్‌.. ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేలా.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే 38 మంది మ‌మ‌త పార్టీ టీఎంసీ ఎమ్మెల్యేల‌ను బీజేపీ త‌న వ్యూహంలోకి తెచ్చుకుంద‌ని.. సాక్షాత్తూ.. ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నేత, బీజేపీ నాయ‌కుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 38 మంది శాసనసభ్యులు బీజేపీతో టచ్లో ఉన్నారని ఆయ‌న చెప్పారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహా పరిస్థితులు.. బంగాల్లోనూ టీఎంసీ+బీజేపీ క‌లిసి మ‌మ‌త‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చ‌ని.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌ని ఆయ‌న కోల్కతాలో జోస్యం చెప్పారు.

"టీఎంసీకి చెందిన కనీసం 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. వారిలో 21 మంది నాతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారు.

మహారాష్ట్రలో శివసేన(షిండే వర్గం), బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయని నేను ముంబయిలో ఉండగా పత్రికలో చదివాను. ప్రస్తుతం బీజేపీ దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా అతి త్వరలోనే రెపరెపలాడుతుంది. బంగాల్లో బీజేపీ తన పోరాటం ఆపదు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం" అని  మిథున్ వ్యాఖ్యానించారు.

గతేడాది బంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు  మిథున్ చ‌క్ర‌వ‌ర్తి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచింది. మొత్తం 294 సీట్లున్న బంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 216 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ తరఫున 75 మంది గెలిచారు. అయితే.. వీరిలో ఐదుగురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే అధికార పక్షంలో చేరారు. సో.. ఇక‌, 70 మంది ఉన్నారు.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మ‌రో 70 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అవ‌స‌రం అవుతారు. ఇప్పుడు ఎలానూ 38 మంది ట‌చ్‌లో ఉన్నార‌ని చెబుతున్న బీజేపీ.. మ‌రో 35 మందిని లాగేస్తే.. ఇక‌, మ‌మ‌త స‌ర్కారు కూడా కూలిపోవ‌డం ఖాయ‌మ‌నేది.. మిథున్ అంచ‌నా.. మ‌రి ఇదే జ‌రిగితే.. దేశంలోనే ఇది బిగ్ షాక్ అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News