బీసీసీఐకి మరో మూడేళ్లు గంగూలీనే.. ఎన్నో కీలక పరిణామాలు..?

Update: 2022-09-16 00:30 GMT
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ మరోసారి ఎన్నికవడం ఖాయమే. ఆయనతో పాటు ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు) కూడా రెండోసారి కార్యదర్శి కానున్నారు. క్రికెట్ బోర్డు రాజ్యాంగంలో సవరణలకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో ఈ మేరకు వీరిద్దరూ రెండోసారి పదవుల్లో కొనసాగేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం చూస్తే క్రికెట్ పరంగానే కాక.. ఎన్నో అంశాల రీత్యా ఇది పెద్ద విషయమే.

2025 వరకు ''దాదా''గిరీ

గంగూలీ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే. అతడి నాయకత్వంలోనే టీమిండియా బలమైన జట్టుగా ఎదిగింది. తనదైన రీతిలో జట్టును నడిపించడంలో మాట చెల్లుబాటు కావాలని గంగూలీ కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో మరోసారి బీసీసీఐ చీఫ్ గా ఎన్నికైతే సౌరభ్ గంగూలీ 2025 వరకు పదవిలో ఉంటాడు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం రాష్ట్ర సంఘం, బీసీసీఐల్లో వరుసగా ఆరేళ్లు పదవుల్లో ఉన్నవారు.. మధ్యలో విరామం తీసుకోవాలి. ఇది కచ్చితం. అంటే.. మరో మూడేళ్ల తర్వాత (కూలింగ్ ఆఫ్ పీరియడ్) కాని తిరిగి క్రికెట్ సంఘం పదవుల్లో పోటీ చేయకూడదు. కానీ, బుధవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో.. ఈ తప్పనిసరి విరామాన్ని రద్దు చేసింది. రాష్ట్ర సంఘాలు, బీసీసీఐని కలపకూడదంటూ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సంఘంలో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు పదవుల్లో నిరాటంకంగా కొనసాగవచ్చు. అంటే నిరాటంకంగం 12 ఏళ్లు పదవిలో ఉండొచ్చు.

ఎందుకొచ్చిన నిబంధన...?

క్రికెట్ సంఘాలంటేనే అనేక రాజకీయాలు.. ఆటగాళ్ల ఎంపిక నుంచి నిధుల వినియోగం వరకు వీటిపై ఎన్నో ఆరోపణలు. ఇక సంఘాల పదవుల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన వారు ఎందరో. వీరి ఏకస్వామ్యానికి అడ్డుకట్ట వేసేసందుకు తీసుకొచ్చిందే కూలింగ్ ఆఫ్ పీరియడ్. ఆ ప్రకారం చూస్తే.. గంగూలీ 2015లో బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాడు. 2019లో బీసీసీఐ చీఫ్ గా ఎన్నికయ్యాడు.

జై షా కూడా ఇలానే పదవులు నిర్వర్తించాడు. ఈ లెక్కన వీరి ఆరేళ్ల పదవీ కాలం పూర్తయింది. అంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ పాటించాల్సి వచ్చింది. అయితే, రాష్ట్ర స్థాయి సంఘం పదవిని, బీసీసీఐ పదవిని కలపడం తగదంటూ బీసీసీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఇది పెండింగ్ లో ఉండడంతో టెక్నికల్ గా గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగుతున్నారు. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో వీరు మూడేళ్లు కొనసాగే అవకాశం చిక్కింది. 'తప్పనిసరి విరామం''ను సుప్రీం రద్దు చేయకున్నా.. కీలక సవరణ చేసింది. రాష్ట్రంలో నిరవధికంగా ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు పనిచేసే వెసులుబాటు ఇచ్చింది.

కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్ సహా మూడేళ్లలో మార్పులెన్నో?

సుప్రీం తాజా తీర్పుతో గంగూలీ, జై షా 2025 వరకు బీసీసీ పదవిలో ఉంటారు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. ఈ కాలంలో జరిగే మార్పుల గురించి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్, ఆ తర్వాత టి20 ప్రపంచ కప్ తో పాటు ఎన్నో కీలక టోర్నీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వీటికితోడు ఇంకా ప్రత్యేకం ఏమంటే వచ్చే మూడేళ్లలో భారత క్రికెట్ లో ఎందరో దిగ్గజాలు రిటైర్మెంట్ కు వచ్చే అవకాశం ఉంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వీరిలో చెప్పుకోదగ్గవారు. ధావన్ కు ఇప్పుడు 36 ఏళ్లు. రోహిత్ కు 35. వీరిద్దరూ 2025లో రిటైర్మెంట్ పక్కా అనొచ్చు. ఇక కోహ్లికి 2025 నాటికి 37 ఏళ్లు వస్తాయి. రిటైర్మెంట్ కు దగ్గరవుతాడు. ఒకరిద్దరు పేస్ బౌలర్లు కూడా అప్పటికి రిటైరయ్యే అవకాశం ఉంది. దీనికితోడు ప్రథ్వీ షా, శుభమన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ వంటి కొత్త తరానికి అవకాశాలు కల్పించే ప్రయత్నం జరగొచ్చు.

రాజకీయ కోణంలోనూ..?

గంగూలీ రెండేళ్ల కిందటే రాజకీయ ప్రవేశం చేస్తాడనే వదంతులు వచ్చాయి. బెంగాల్ నుంచి బీజేపీ సీఎం అభ్యర్థి అవుతాడని బలమైన ప్రచారం జరిగింది. దీనికోసం అతడిపై పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినట్లు అనుకున్నారు. దీంతోనే గంగూలీ ఛాతీ నొప్పికి గురై ఆస్పత్రి పాలైనట్లు ఆరోపణలు వ్యాపించాయి. కానీ, ఇవేవీ అవునని కాదని తేలలేదు. ఈలోగా బెంగాల్ ఎన్నికలు (2021 మే) వచ్చాయి. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీదే గెలుపు అయింది. బీజేపీకి రిక్త హస్తమే ఎదురైంది. అయితే, 2025లో జరిగే ఎన్నికలకు మాత్రం బీజేపీ గట్టిగా పోటీపడే అవకాశం కనిపిస్తోంది. అప్పటికి గంగూలీని ఒప్పించి.. సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశం ఉంది. ఏమో రాజకీయాల్లో ఏదీ కాదని చెప్పలేం. జై షా కూడా గుజరాత్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది.
Tags:    

Similar News