బాలికకు ధైర్యం చెప్పటం కోసం అంత హడావుడా వాసిరెడ్డి?

Update: 2022-04-26 08:35 GMT
కొన్ని విషయాలు గుట్టుగా ఉంచాలి. మరికొన్నింటిని పబ్లిక్ చేయాలి. ఈ చిన్న తేడాను ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మిస్ అయ్యారా? అన్నది ప్రశ్న. తాజాగా ఆమె చేసిన ఒక పరామర్శపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టుగా నాలుగు గోడల మధ్య బాధితురాలికి సాయం చేయాలి.. అవసరమైతే ప్రైవేటుగా పిలిపించుకొని మాట్లాడాలే తప్పించి.. బాధితురాలి గురించి అందరూ మాట్లాడుకునేలా హడావుడి చేయటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒక ప్రాంతంలో పని చేసే వాలంటీరు భర్త బాలికను లైంగికంగా వేధించిన ఉదంతం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ.. ఆమెతో పాటు పెద్ద ఎత్తున బాధితురాలి ఇంటికి వచ్చారు. ఇలాంటి ఉదంతాల్లో ప్రైవసీ అన్నది చాలా ముఖ్యం. ఒక సామాన్య బాలిక విషయంలో జరిగిన పరామర్శ తంతు మరింత వివరంగా చెప్పాలంటే ఒక ఉదాహరణను ఇక్కడ ప్రస్తావిస్తా.

ఇప్పుడు ఎలాగైతే ఒకడి కారణంగా మహిళ లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయో.. ఒక పెద్దింటి అమ్మాయికి అలానే జరిగినప్పుడు ఏం జరుగుతుంది? సదరు కుటుంబం తమ పేరు.. వివరాలు బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తారు.

పోలీసులు వారి ఇంటి ఛాయలకు రాకుండానే నిందితుడ్ని పట్టుకొని.. వాడికి చేయాల్సింది చేస్తారు. చివరకు పోలీసు కంప్లైంట్ కాదు. మీడియాకు సమాచారం కూడా ఉండదు. ఎందుకిలా? అంటే.. పెద్దింటి అమ్మాయికి పరువు నష్టం జరగకూడదని.. వారి వివరాలు బయటకు రావటం ద్వారా.. ఆమె ఇబ్బందులు ఎదురుకాకూడదని.

మరి.. పెద్దింటి అమ్మాయి విషయంలో పాటించే గోప్యత.. ఒక సాదాసీదా అమ్మాయి విషయంలో ఎందుకు ఉండదు. వాసిరెడ్డి పద్మ లాంటి పేరున్న నేత.. తన పరివారం మొత్తాన్ని పట్టుకొని వచ్చి.. ఒక చిన్న గ్రామంలో ఒకరింటికి వెళ్లటం ద్వారా.. అప్పటివరకు ఆ ఊళ్లో సదరు బాధితురాలి గురించి తెలిసిన దాని కంటే.. పరామర్శ కారణంగా ఇతర ఊళ్లకు కూడా తెలిసే వీలుంటుంది.

అదే జరిగితే.. రేపొద్దున నుంచి సదరు మహిళ బయటకు రావటం.. నలుగురిని ఫేస్ చేయటం ఎంత కష్టంగా ఉంటుంది. నిజానికి బాధిత మహిళ ఎలాంటి తప్పు చేయకున్నా.. ఈ తరహా ప్రచార పరామర్శ కారణంగా వారి గోపత్య గాల్లో కలిసిపోతుందన్నది మర్చిపోకూడదు. అందుకే ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలన్న విషయం వాసిరెడ్డి పద్మలాంటి వారు చెప్పించుకోవాల్సి రావటమేంటి?
Tags:    

Similar News