లంచంతో పాటు 'మంచం' కూడా కావాలన్నాడు

Update: 2016-01-10 06:25 GMT
లంచాలు మరిగిన అధికారులు ప్రజలకు పెడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రతి పనికీ సిగ్గులేకుండా డబ్బులు అడగడం సాధారణమైపోయింది.. ఇప్పుడు కొందరు అధికారులు లంచాలను దాటి ఇంకా ముందుకెళ్లిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే మహిళలను ఇంకేదో ఆశిస్తున్నారు. లంచం ఇవ్వకపోయినా ఫర్వాలేదు నా మంచం మీదకొస్తే పనిచేసేస్తా అంటూ అమానుషంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరులో అలాంటి ప్రయత్నం చేసిన ఓ ఎలక్ర్టిసిటీ ఆఫీసరుకు మహిళా కాంట్రాక్టరు ఒకరు చెప్పు దెబ్బ రుచిచూపించారు.

బిల్లులు చెల్లించాలంటే లంచం ఇవ్వడంతో పాటు కోర్కె తీర్చాలని వేధిస్తున్న విద్యుత్‌ శాఖ అధికారికి ఓ మహిళా కాంట్రాక్టర్‌ చెప్పు దెబ్బ రుచిచూపించింది. చెప్పుతో చెంపలు పగలగొట్టడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల కిందట చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  విద్యుత్‌ శాఖలో వివిధ కాంట్రాక్టు పనులు చేస్తున్న ఆ మహిళకు డిపార్టుమెంటు నుంచి బిల్లులు రావాల్సి ఉంది. ఈ బిల్లులు పోల్స్‌ సెంటర్‌ కార్యాలయం నుంచి మంజూరు కావాల్సి ఉండటంతో కొంత కాలంగా ఆ బకాయిల కోసం ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. కార్యాలయంలో ఏడీఈ రవికుమార్‌ లంచం అడగడంతో పాటు తన కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. కొద్దికాలంగా ఆయన వేధిస్తుండడంతో ఆగ్రహించిన ఆమె  బుద్ధి చెప్పింది. జిల్లా విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయానికి వెళ్లి ఆయన చాంబర్‌ లో ఉన్న సదరు అధికారిని అందరి ముందే చెప్పు తీసుకుని ఆ చెంప ఈ చెంప వాయించింది. మధ్యలో జోక్యం చేసుకోబోయిన తోటి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇంట్లో ఆడవారిని వేధిస్తే ఇలానే సర్దిచెపుతారా అంటూ ఆగ్రహించింది. దీంతో ఆ చాంబర్‌ లో ఉన్న ఎస్‌ ఈతో పాటు మిగిలిన అధికారులు మిన్నకుండి పోయారు. అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి తనను లైంగిక వేధింపులకు గురిచేసిన విషయమై ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఇప్పటికే కాల్ మనీ కలకలం సృష్టించిన నేపథ్యంలో అధికారులు ఆడవాళ్లపై ఆకృత్యాలు దిగుతుండడం సంచలనం కలిగిస్తోంది.
Tags:    

Similar News