వైసీపీలో చేరి తప్పు చేశా.. టీడీపీ మాజీ మంత్రి కాళ్లు పట్టుకున్న వైసీపీ కార్యకర్త!

Update: 2022-12-27 09:30 GMT
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో సంచలన ఘటన జరిగింది. వైసీపీ కార్యకర్త ఒకరు ఆ పార్టీలో చేరి తప్పు చేశానంటూ టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. రాప్తాడు మండలం మరూరులో పరిటాల సునీత.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముచ్చుమర్రి రామాంజనేయులు అనే  వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి క్షమించాలంటూ వేడుకున్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత.. రామాంజనేయులు ఇంటికి రాగానే ఆయన పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నాడు. తనను తిరిగి టీడీపీలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డాడు.

దీంతో పరిటాల సునీత కూడా అతడికి అభయమిచ్చారు. జరిగిందేదో జరిగిపోయిందని.. టీడీపీలో ఎప్పటికీ మీ లాంటి వాళ్లకు చోటు ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రామాంజనేయులకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. మనది తెలుగుదేశం అంటూ ఆప్యాయంగా మాట్లాడి పార్టీలోకి రామాంజనేయులను ఆహ్వానించారు.

కాగా వచ్చే ఎన్నికల్లో మరోసారి రాప్తాడు నుంచి పోటీ చేయడానికి పరిటాల సునీత సిద్దమవుతున్నారు. ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఉన్నారు.

మరోవైపు పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ అనంతపురం జిల్లాలోని ధర్మవరం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ధర్మవరం నుంచి ప్రస్తుతం వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News