ఉదయ్‌కిరణ్‌ అభిమానులూ.. బీ రెడీ

Update: 2015-06-10 19:30 GMT
ఉదయ్‌కిరణ్‌.. ఈ పేరు వింటే ఒకప్పుడు అమ్మాయిల గుండెలు శ్రుతి తప్పేవి. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. మన పక్కింటి కుర్రాడిలా కనిపించే ఉదయ్‌.. మధ్యతరగతి ప్రేక్షకుల కుటుంబాల్లోకి చొచ్చుకుపోయాడు. కానీ ఎంత వేగంగా పైకిదిగాడో.. అంతే వేగంగా కింద పడ్డాడు. హీరోగా అవకాశాల్లేక.. జీవితంలో శూన్యం ఆవహించి.. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని.. తన అభిమానులకు తీరని శోకం మిగిల్చాడు ఉదయ్‌. అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే ఏడాది దాటిపోయింది.

ఐతే ఉదయ్‌ మన మధ్య లేకున్నా.. అతడు నటించిన చివరి సినిమా చూసే అవకాశం దక్కుతోంది. ఉదయ్‌ చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 26న ఉదయ్‌ కిరణ్‌ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఉదయ్‌ దగ్గర మేనేజర్‌గా పని చేసిన ఈ చిత్ర నిర్మాత మున్నా తెలిపారు. మోహన్‌ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. గత ఏడాదే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఆసక్తికరంగానే అనిపించింది. 26న రుద్రమదేవి లాంటి భారీ సినిమా ఉన్నప్పటికీ.. ఉదయ్‌ను అభిమానించే వాళ్లు 'చిత్రం చెప్పే కథ' చూడ్డానికి వస్తారని దర్శక నిర్మాతల నమ్మకం.

Tags:    

Similar News