భీమ్లా దర్శకుడికే ఆ క్రెడిట్ దక్కాలి..

Update: 2022-02-24 05:53 GMT
''భీమ్లా నాయక్'' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మొన్న ట్రైలర్ వచ్చే వరకు దర్శకుడు సాగర్ కె. చంద్ర కు తగిన గుర్తింపు లేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారని అంటున్నా.. వెనకుండి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారని అనుకున్నారు. 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి మంచి సినిమాని అందించిన సాగర్ ను.. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో సైడ్ చేశారనే కామెంట్స్ కూడా వచ్చాయి.

త్రివిక్రమ్ వల్లనే పవన్ కళ్యాన్ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ చెయ్యడానికి ఒప్పుకున్నారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. పవన్ సైతం 'భీమ్లా నాయక్' సినిమాకి త్రివిక్రమ్ వెన్నెముక అని కొనియాడారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదని.. ఆయన ముందుండి ఈ చిత్రాన్ని నడిపించారని అన్నారు. అదే సమయంలో డైరెక్టర్ సాగర్ గురించి కూడా పవన్ మాట్లాడారు.

తెలంగాణలోని నల్గొండకు చెందిన సాగర్.. అమెరికాలో చదువుకుంటూ, సినిమా మీద ఫ్యాషన్ తో చిత్ర పరిశ్రమలో బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే స్పీచ్ లో తెలంగాణాకు చెందిన సాగర్ చంద్ర.. కిన్నెర మొగులయ్యని గుర్తించి ఈ ప్రాజెక్ట్‌ లోకి తీసుకొచ్చాడనే విషయాన్ని పవన్ వెల్లడించారు. ఇప్పటి వరకు మొగుల‌య్య‌ను త్రివిక్రమ్ వెలుగులోకి తీసుకొచ్చి థమన్ సారధ్యంలో 'భీమ్లా నాయక్' పాట పాడించారని వార్తలు వచ్చాయి.

అయితే మొగుల‌య్య‌ గురించి మొదట త్రివిక్రమ్ కు చెప్పింది సాగర్ అని.. ఆ తర్వాత ఆయన వెళ్లి థమన్ కు చెబితే మొగుల‌య్య‌తో పాడించారని పవన్ చెప్పారు. ఇక కిన్నెర మొగులయ్య తన ప్రసంగంలో కేసీఆర్ నుంచి పవన్ వరకు ఎంతో మంది తనకు ఆర్థిక సాయం చేసి రాత్రికి రాత్రే స్టార్‌ ని చేశారని అన్నారు. 'భీమ్లానాయక్' సినిమాలో పాట పాడటం తన అదృష్టమని.. ఈ పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేదని.. ఇంత మంచి పేరు కూడా వచ్చుండేది కాదని అభిప్రాయపడ్డారు.

భీమ్లా పాట పాడిన త‌రువాతే ఢిల్లీలో తనకు ప‌ద్మశ్రీ అవార్డు వ‌చ్చిందని.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా తనతో అంద‌రూ సెల్పీలు దిగుతున్నారని.. తాను ఇంత పాపులారిటీ కావడానికి ఈ పాట పాడటమే కారణమన్నారు మొగులయ్య. తన పాటలపై శ్రీను అనే విద్యార్థి పీహెచ్డీ చేస్తున్నారని.. తనకు గుర్తింపు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ - మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మొగులయ్య పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొగులయ్య జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి దర్శకుడు సాగర్ కె చంద్ర అని అనొచ్చు. ఇక ఈ కార్యక్రమంలో సాగర్ చంద్ర మాట్లాడిన విధానం చాలా సింపుల్‌ గా ఉన్నప్పటికీ ఆకట్టుకుంది. అతను తన ప్రసంగం అంతటా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఒక అభిమానిగా పవన్‌ కల్యాణ్‌ ను డైరెక్ట్‌ చేయడం తన అదృష్టమని.. తన చుట్టూ ఉన్న మంచి వాళ్ల వల్ల పవన్‌ కల్యాణ్‌ ని డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కిందన్నారు సాగర్.

ఇకపోతే 'భీమ్లా నాయక్' సినిమా తర్వాత సాగర్ కె చంద్ర కు క్రేజీ ఆఫర్స్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రేపు థియేటర్లలోకి రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాతో సాగర్ పేరు బాగా వినిపిస్తుందని నమ్ముతున్నారు. మరి సాగర్ కెరీర్ కు భీమ్లా ఏవిధంగా ప్లస్ అవుతుందో చూడాలి.

భీమ్లా చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిమించారు. ఇందులో రానా దగ్గుబాటితో పాటుగా నిత్యా మీనన్ - సంయుక్త మీనన్ - సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
Tags:    

Similar News