ఎన్టీఆర్ తన పిల్లల భవిష్యత్ గురించి భలే ఆలోచిస్తున్నాడే!

కానీ ఇటీవల పలు సందర్భాల్లో తన ఇద్దరు పిల్లల గురించి మాట్లాడారు.

Update: 2024-10-11 19:30 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే, వీలైనంత ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికే చూస్తుంటారు. కుదిరినప్పుడల్లా భార్యా పిల్లలతో కలిసి హాలిడేకి వెళ్తుంటారు. సినీ ఈవెంట్స్ కు కూడా తీసుకొస్తుంటారు. అయితే సినిమా ఇంటర్వ్యూలలో తారక్ పెద్దగా తన ఫ్యామిలీ విషయాలను పంచుకోరు. కానీ ఇటీవల పలు సందర్భాల్లో తన ఇద్దరు పిల్లల గురించి మాట్లాడారు. తన తండ్రి తనను ఎలా పెంచేవారో అలానే తన పిల్లలను కూడా పెంచుతున్నానని చెప్పారు.

‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కుమారులు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్ గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరి ఆలోచనా విధానంలో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. పిల్లలని సినీ ఇండస్ట్రీలో తీసుకువస్తారా? అని ప్రశ్నించగా.. నా అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం నచ్చదు. నేను అలా చేయను. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండాలని నేను నమ్ముతాను. వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలి. మనకి నచ్చింది చెయ్యమని చెప్పడం సరికాదు అని తారక్ అన్నారు.

"సినిమాల్లోకి రమ్మని, యాక్టింగ్‌ కెరీర్ ను ఎంచుకోమని నేను వాళ్లను బలవంతం చెయ్యను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను ఆ విధంగా ట్రీట్‌ చేయలేదు. ఏదో సాధించాలనుకుంటున్నాడు.. చేయనివ్వు అనుకున్నారు. అదే విధంగా నేనూ నా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలనుకుంటున్నాను. నా ప్రొఫషన్ ఏంటనేది నా పిల్లలకు తెలుసు. తండ్రిని నటుడిగా చూసినప్పుడు అదే దారిలో అడుగులు వేయాలని పిల్లలు కూడా అనుకుంటారు. ఇది సహజంగా జరుగుతుంది" అని ఎన్టీఆర్‌ చెప్పారు.

ఇప్పటికైతే ఎన్టీఆర్ కుమారులిద్దరూ తన తండ్రి మాదిరిగా సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. వాళ్లకు సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్చనిస్తున్న తారక్.. భవిష్యత్ లో వాళ్లకు ఏది చేయాలనిపిస్తే ఆయా రంగాల్లో వాళ్ళను నడిపించేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెబుతున్నారు. ఇకపోతే తన ఇద్దరు కుమారులు సినిమాలు చూస్తారని, తన సినిమాకే కాదు ఏ హీరో సినిమా అయినా ఎంజాయ్ చేస్తారని మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే, గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడుమీదున్న జూనియర్ ఎన్టీఆర్.. RRR చిత్రంతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. లేటెస్ట్ గా 'దేవర 1' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర రూ. 470 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా త్వరలో 'దేవర 2' చిత్రం రూపొందనుంది. అంతకంటే ముందు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అలానే 'వార్ 2' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Tags:    

Similar News