జనసేనతో టాలీవుడ్.. మొదటి హీరోయిన్ కూడా..

అయితే పవన్ చేతిలో ఉన్న సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న విషయం తెలిసిందే

Update: 2024-06-24 12:08 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. బాధ్యతలు స్వీకరించాక తన మార్క్ పాలనను రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారు. అధికారులతో వరుస మీటింగ్స్, సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కొన్ని విషయాల్లో అధికారులను నిలదీస్తున్నారు. తన కార్యాలయం బయట ప్రజా దర్బార్ నిర్వహిస్తూ.. అక్కడికక్కడే కొన్ని సమస్యలు క్లియర్ చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే పవన్ చేతిలో ఉన్న సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సెట్స్ లోకి మళ్లీ పవన్ ఎప్పుడు అడుగు పెడతారో కూడా తెలియదు. అదే సమయంలో పవన్ ఫస్ట్ మూవీ హీరోయిన్ గుర్తుందా? అదేనండీ సుప్రియ యార్లగడ్డ. ఆ ఒక్క సినిమా చేసిన సుప్రియ.. ఆ తర్వాత మూవీస్ కు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు పలు తెలుగు సినిమాలు నిర్మిస్తున్నారు. ఆమెతో పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సినిమా చేశారు.

ఇప్పుడు పవన్, సుప్రియ దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ను నేడు పలువురు తెలుగు సినీ నిర్మాతలు కలిసిన విషయం తెలిసిందే. అంతా కలిసి పవన్ ను అభినందించిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ను కలిసిన వారిలో సుప్రియ కూడా ఉన్నారు. భేటీ అయ్యాక పవన్, సుప్రియ కలిసి ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో సుప్రియ.. పవన్ కు స్పెషల్ బుక్ కూడా బహుకరించినట్లు తెలుస్తోంది.

ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత దిల్ రాజు కూడా పవన్ తో కలిసి పిక్ తీసుకోగా.. ఆ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిక్ అదిరిందని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్ తో పూర్తి స్థాయిలో చర్చించలేదని నిర్మాత అల్లు అరవింద్ మీడియాకు తెలిపారు. త్వరలో మరోసారి కలిసి అన్ని విషయాలపై కూలంకషంగా చర్చిస్తామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ రిక్వెస్ట్ కు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు అల్లు అరవింద్ తెలిపారు. దీని బట్టి చూస్తే.. ప్రత్యేకంగా ఒక వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ తో తెలుగు నిర్మాతల సమావేశం జరిగింది. అందులో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.

అయితే పవన్ ను కలిసిన వారిలో నిర్మాతలు సి.అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, డి. సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, సుప్రియ యార్లగడ్డ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు ఉన్నారు. వీరందరూ కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News