మోడీ భక్తులందు ఈ భక్తుడు వేరయా.. ఇది ఉత్తుత్తి రక్తదానమయా!

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-20 15:30 GMT

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మరికొంతమంది భక్తులుగా కూడా ఉంటుంటారు.. 'నమో' అని అంటుంటారు! అయితే ఈ భక్తులందరూ ఒకెత్తు అయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన బీజేపీ నేత ఒకెత్తు.. ఆయన భక్తి వేరే ఎత్తు!

అవును... ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ మేయర్ వినోద్ అగర్వాల్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట ఆసక్తిగా మారింది. ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యవహారం ఇప్పుడు కామెంట్ల వర్షానికి కారణమవుతోంది.

వివరాల్లోకి వెళ్తే... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా యూపీలోని మొరాదాబాద్ లోనూ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ వినోద్ అగర్వాల్ కూడా పాల్గొనాలని ఫిక్సయ్యారు. అనుకున్నదే తడువుగా ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం... ఆస్పత్రి బెడ్ పై పడుకుని రక్తదాన ప్రక్రియను ప్రారంభించారు.

ఇలా మేయర్ రక్తదానం చేస్తుండటంతో కెమెరాలు అన్నీ ఆన్ అయ్యాయి. ఈ సమయంలో తొలుత మేయర్ బీపీని వైద్యులు పరిశీలించారు. అనంతరం రక్తదాన ప్రక్రియను ప్రారంభించారు. బంతిని చేతిలో పట్టుకుని ఉంచారు. ఈ సమయంలో మేయర్ నవ్వడం మొదలుపెట్టారు. డాక్టర్ తో.. ఇక వదిలేయండి.. అని చెప్పారు.. విషయం అర్ధం చేసుకున్న డాక్టర్ లైట్ తీసుకున్నారు!

అనంతరం మేయర్ లేచి, అభినందనల నినాదాల మధ్య అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో... ఈ ఉత్తుత్తి రక్తదాన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా... మేయర్ ను మంచి నటుడంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. కమల్ హాసన్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News