భారత్ లో నివసించే వారంతా హిందువులే.. మోహన్ భాగవత్ తాజా మాటలు విన్నారా?

Update: 2022-11-16 04:34 GMT
కష్టం ఉన్నా.. అనుకోని విపత్తు ఏర్పడినా ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందుగా వచ్చేసి.. క్రమశిక్షణతో సాయం అందించే సంస్థల్లో ముందు ఉంటుంది సంఘ్ పరివార్. దీనిపై పాజిటివ్ కంటే నెగిటివ్ గానే పలువురు ప్రచారం చేస్తుంటారు.

తమకు రాజకీయాలు కంటే కూడా తాము నమ్మిన సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నట్లుగా సంఘ్ పరివార్ కు చెందిన వారి తీరు ఉంటుంది. అయితే.. సంఘ్ పరివార్ ను భూతంగా చూసే ధోరణి వామపక్ష వాదులు.. మీడియాలోని కొందరు వామపక్ష్ మేధావులతో మొదలై. .అదో పెద్ద వాదనగా మారటం తెలిసిందే.

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో సంఘ్ పరివార్ చీఫ్ మోహన్ భాగవత్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావటంతో పాటు.. భారత దేశ జనులంతా కూడా హిందువులే అన్న విషయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్లే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత్ ను తమ మాతృభూమిగా భావించి.. ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వ కల్చర్ తో కలిసి జీవించాలనుకునే వారి కులం ఏదైనా.. మతం ఏదైనా.. వారు మాట్లాడే భాష ఏదైనా.. ఆహార అలవాట్లు.. సిద్ధాంతాల్లో వ్యత్యాసాలు ఉన్నా సరే వారంతా హిందువులే అని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాను ఇప్పుడు చెప్పటం లేదని.. తాము 1925 నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించటం హిందుత్వ సిద్ధాంతమన్న ఆయన.. వేలాది ఏళ్లుగా భారత్ ఇదే భిన్నత్వాన్ని చాటి చెబుతుందన్నారు. 40 వేల ఏళ్ల క్రితం అఖండ భారత్ లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనని తేల్చారు.

ఇతరుల విశ్వాసాల్ని.. సంప్రదాయాల్ని మనమంతా గైరవించాలి. సొంత లక్ష్యాల్ని సాధించుకోవటం కోసం ఇతరుల సంపదను దోచుకోవద్దన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. 'మన మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలిచి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారం' అన్న భాగవత్ మాటల్ని చూస్తే.. ఈ మధ్యన ఆయన మాటల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నది మాత్రం నిజమంటున్నారు,


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News