విభజన పుణ్యమే జగన్ కి అధికారం....అదిరిందిగా పంచ్

Update: 2022-12-10 13:30 GMT
ఉమ్మడి ఏపీ రెండుగా విభజించడం వల్లనే ఏపీలో జగన్ కి అధికారం దక్కింది అని కొత్త విశ్లేషణ వినిపించారు బీజేపీ నేత, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ క్రిష్ణారావు. ఏపీ కలసి ఉంటే కచ్చితంగా జగన్ కి అధికారం దక్కేది కాదని కుండబద్ధలు కొట్టారు. ఒక వైపు సమైక్య రాష్ట్రం అని జగన్ ఆంతరంగీకుడుగా ముద్రపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి పాట పాడుతున్న నేపధ్యంలో అటు తెలంగాణాలో ప్రకంపనలు పెద్ద ఎత్తున చెలరేగాయి.

అదే టైం లో ఏపీలో కూడా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. టీడీపీ అయితే ప్రజల సమస్యలు తప్పుదోవ పట్టించడానికే ఇలాంటివి అని విమర్శించింది. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ఇదే తీరున వైసీపీ ప్రభుత్వం మీద దాడి చేసారు. ఇపుడు బీజేపీకి చెందిన ఐవైఆర్ క్రిష్ణారావు ఒక సోషల్ మీడియా చానల్ తో మాట్లాడుతూ కొత్త విషయాలను చెప్పుకొచ్చారు.

ఏపీ రెండుగా విడిపోవడం వల్లనే ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు అని పేర్కొన్నారు. ఉన్మ్మడి ఆంధప్రదేశ్ కనుక కొనసాగి ఉన్నట్లు అయితే జగన్ కి అధికారం ఎప్పటికీ ఎండమావిగానే మిగిలివిపోయి ఉండేదని ఆయన చెప్పడం విశేషం. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అన్నది వైసీపీకి రాజకీయంగా పెద్ద ఎత్తున ఉపయోపడింది అని అన్నారు

ఇపుడు తాపీగా ఉమ్మడి రాష్ట్రం కావాలీ అంటూ సజ్జల ఇస్తున్న స్టేట్మెంట్స్ అర్ధరహితం అని ఆయన అన్నారు. అదే టైం లో ఇది అసాధ్యమైన ప్రతిపాదనగా ఆయన కొట్టిపారేశారు. అడ్డగోలు విభజన అంటూ పాత విషయాలను తవ్వుకుంటూ పోవడం కంటే కూడా ఏపీ అభివృద్ధి మీద మేధావులు సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

అదే టైం లో ఏపీకి విభజన కంటే కూడా అతి పెద్ద అన్యాయం జరిగింది చంద్రబాబు జగన్ పాలనలోనే అని ఆయన విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులూ కలసి ఏపీని అన్ని విధాలుగా నష్టపరచారు అని ఆయన మండిపడ్డారు. అద్భుతమైన సహజ వనరులు కలిగిన ఆంధ్రా అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాల్సిన రాష్ట్రమని  ఆయన అన్నారు. అయితే ఆంధ్రా విభజన తర్వాత కూడా తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. పాత విషయాలను పట్టుకుని వేలాడడం కంటే విభజన ఏపీని సరైన దారిలో నడిపించేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు. మొత్తానికి ఐవైఅర్ క్రిష్ణా చాలా విషయాలలో స్పష్టతను ఇచ్చారు. విభజన ఏపీ కనుకనే జగన్ పవర్ లోకి వచ్చారు అని ఆయన చెప్పిన విశ్లేషణ కూడా ఆలోచించేలా ఉంది ఇక విభజన కంటే కూడా టీడీపీ వైసీపీ పాలనలోనే అధిక నష్టం రాష్ట్రానికి జరిగింది అని ఆయన చెప్పిన విషయం మీద కూడా అంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

ఏ కారణం లేకుండా  సజ్జల ఇలాంటి స్టేట్మంట్స్ ఎందుకు ఇస్తారు అన్న చర్చ కూడా ఇంకో వైపు సాగుతోంది. టీయారెస్ కి తెలంగాణా వాదం ద్వారా రాజకీయ లబ్దిని కలిగించేందుకే ఆయన ఈ విధంగా మాట్లాడారు అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఆయన ఆలపించిన సమైక్య రాగం మాత్రం విమర్శల పాలు అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News