బీజేపీలో చేరితే.. లిక్క‌ర్ కేసు కొట్టేస్తామంటున్నారు: సిసోడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-08-22 13:34 GMT
బీజేపీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారంటూ ఆయ‌న కామెంట్లు చేశారు. అయితే..దీనిని తాను నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాన‌ని ఆయ‌న చెప్పారు. "మహారాణా ప్రతాప్, రాజ్పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను" అని సమాధానం ఇచ్చానని సిసోడియా చెప్పారు.

``బీజేపీ నుంచి నాకు ఓ సందేశం అందింది. ఆప్ను వ‌దిలేసి బీజేపీలో చేరితే.. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులన్నీ మూసేస్తామన్నారు.

దానికి సమాధానం ఇస్తూ.. నేను మహారాణా ప్రతాప్, రాజ్పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి`` అని స‌మాధాన మిచ్చాను.. అని సిసోడియా వ్యాఖ్యానించారు.

లిక్క‌ర్ స్కాంకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మనీష్ నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. సిసోడియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని  సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు దేశం విడిచి వెళ్లిపోకుండా.. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్‌ విధానంతో ముడిపడిన ఈ సోదాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీల‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ ప్రభుత్వానికి ఆదరణ పెరగడాన్ని ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని ఆప్‌ విమర్శించింది. పంజాబ్‌లో ఆప్‌ విజయం తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల్లో భయం పట్టుకుందని, కేజ్రీవాల్‌ ఉన్నతిని నిలువరించాలన్న కుట్రలో భాగంగానే సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయంటూ సిసోడియా ధ్వజమెత్తారు.

మరోవైపు మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. లిక్క‌ర్ కేసు.. ఇప్ప‌ట్లో తేల‌క‌పోగా.. మ‌రింత రాజ‌కీయంగా మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News