ఏపీ మంత్రి నోటి వెంట ఆపరేషన్ గరుడ

Update: 2018-05-31 17:31 GMT
ఆపరేషన్ గరుడ.. కొన్ని రోజుల కిందట సమైక్యాంధ్ర ఉద్యమకారుడు, హీరో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఈ విషయాన్ని చాలామంది కొట్టిపారేశారు. కానీ.. ఇప్పుడు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు నోటినుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగిన ఆయన ఆ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తూ రహస్య వ్యూహాలు అమలు చేస్తోందని ఆరోపించారు.
    
వైసీపీ అధినేత జగన్ తో లాలూచీ రాజకీయాలు చేస్తూ, మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు రాయించడం - రమణ దీక్షితులతో ఆరోపణలు చేయించడం... ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బీజేపీ ఇలాగే ప్రవర్తిస్తే... వారి వ్యూహం బెడిసికొట్టే అవకాశం ఉందని... కన్నడిగుల మాదిరే ఏపీ ప్రజలు కూడా ఆ పార్టీకి గడ్డి పెడతారని అన్నారు.
    
ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలిందని యనమల చెప్పారు. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక గాలి వీస్తోందని... కర్ణాటకతో ప్రారంభమైన బీజేపీ పతనం, 2019 ఎన్నికలతో పరిపూర్ణమవుతుందని అన్నారు. వరుసగా ఓటములు ఎదురవుతున్నా... బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను మహానాడులో వివరించేసరికి... బీజేపీ నేతలకు దిమ్మతిరిగిందని అన్నారు. గుజరాత్, మహారాష్ట్రలకే కేంద్ర నిధులు తరలివెళ్తున్నాయని... ఏపీకి ఇస్తామన్న నిధులు, చేస్తామన్న పనులు కాగితాలకే పరిమితమయ్యాయని చెప్పారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత... ఏపీపై బీజేపీ కక్ష పెట్టుకుందని అన్నారు.
Tags:    

Similar News